Kamareddy Municipal Meeting | మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం రాజ్యాంగ విరుద్ధం: మున్సిపల్ ఛైర్​పర్సన్ ఉమారాణి

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipal Meeting | మున్సిపల్ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కేవీఆర్ ​(KVR MLA) సమావేశం నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని కామారెడ్డి మున్సిపల్ ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి (Uma Rani) అన్నారు. ఎమ్మెల్యేకు కేవలం ఎక్స్ అఫీషియో సభ్యత్వం మాత్రమే ఉంటుందని గుర్తు చేశారు. శనివారం మున్సిపల్ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.

Kamareddy Municipal Meeting | కనీస సమాచారం లేదు

కామారెడ్డి మున్సిపాలిటీని (Kamareddy Municipality) ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి నడిపించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై మున్సిపల్ ఛైర్‌పర్సన్ తప్పుబట్టారు. మున్సిపల్ అధికారులందరితో మే 23న క్యాంప్ ఆఫీస్‌లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కార్యాలయం నుండి కమిషనర్‌కు లేఖ రావడం, అధికారులపై ఒత్తిడి చేసి సమావేశం నిర్వహించడం అప్రజాస్వామికమన్నారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం-2019.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఈ సమావేశం గురించి ఎన్నికైన ఛైర్‌పర్సన్‌కు కనీస సమాచారం లేకపోవడాన్ని తప్పుపట్టారు. మున్సిపాలిటీలు రాజకీయ నాయకుల సొంత ఆస్తులు కావని, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రజలచే ఎన్నికైన ఛైర్‌పర్సనే మున్సిపాలిటీకి రాజకీయ అధిపతి అని నొక్కి చెప్పారు.

Kamareddy Municipal Meeting | ఎక్స్​ అఫీషియో సభ్యులు మాత్రమే..

చట్టప్రకారం ఎమ్మెల్యే కేవలం ఒక ఎక్స్-అఫీషియో సభ్యుడు మాత్రమేనని, వారికి ఎలాంటి కార్యనిర్వాహక అధికారాలు ఉండవని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మున్సిపాలిటీకి ఇచ్చే ఆదేశాలు ఏ మాత్రం చెల్లవని, ఏ నిర్ణయమైనా మున్సిపల్ కౌన్సిల్ తీసుకోవాల్సిందేనని గుర్తు చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎక్స్‌టెన్షన్ కౌంటర్‌గా మార్చలేరని, ప్రజాస్వామ్య సంస్థలు రాజకీయ బెదిరింపుల కింద పనిచేయవని హెచ్చరించారు. అధికార యంత్రాంగంపై ఒత్తిడి తీసుకువచ్చి, బెదిరింపులకు దిగి, ప్రజల చేత ఎన్నికైన ఛైర్మన్, కౌన్సిలర్లను పక్కనపెట్టి ఎమ్మెల్యే తన సొంత కార్యాలయంలో సమావేశం నిర్వహించడం తగదన్నారు.

మున్సిపాలిటీ అధికారాలను తుంగలో తొక్కుతూ సమాంతర పరిపాలనను సృష్టిస్తూ, అధికారులపై ఒత్తిడి తేవడం స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఏ అధికారంతో ఎమ్మెల్యే మున్సిపల్ యంత్రాంగాన్ని తన ఆఫీస్‌కు పిలిపించుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ శాఖ తక్షణమే జోక్యం చేసుకుని మున్సిపాలిటీల గౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ అప్రజాస్వామిక ధోరణి ఇలాగే కొనసాగితే మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్క అధికారి నుంచి వివరణ కోరుతామని తెలిపారు.

ఇది కూడా చదవండి: PCC Chief Comments | ‘మీడియా’ కథనాలపై పీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *