Storm Damage | గాలివాన బీభత్సం.. రైతులకు అండగా నిలిచిన పోలీసులు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Storm Damage | తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండలు దంచికొట్టగా.. సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది.

అకాల వర్షం (Heavy Rain)తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయింది. అచ్చంపేట (Achampet)లో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి మార్కెట్ యార్డులో ఓపెన్‌గా ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా తడిసిపోయింది. చేతికందివచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎస్సై సద్దాం, తన సిబ్బందితో కలిసి వెంటనే మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. ఖాకీ దుస్తులనే సంకోచం లేకుండా ఎస్సై సద్దాం సిబ్బంది స్వయంగా రంగంలోకి దిగి, తడిసిన మొక్కజొన్నను బుట్టల్లోకి నింపి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Storm Damage | ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా కురిసిన గాలివాన తీవ్ర అల్లకల్లోలం సృష్టించింది. అనకాపల్లి (Anakapalli) జిల్లాలోని నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో దాదాపు అరగంట పాటు వీచిన ఈదురు గాలులు, భారీ వర్షానికి జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. సత్యవరం గ్రామంలో తమలపాకులు సేకరిస్తున్న ఇద్దరు కూలీలపై కొబ్బరి చెట్టు విరిగిపడటంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Storm Damage | తెలంగాణలో..

తెలంగాణలోని మహబూబ్​నగర్​, నాగర్​ కర్నూల్, వనపర్తి, మెదక్​, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు వీయడంతో చెట్లు నేలకూలాయి. విద్యుత్​ స్తంభాలు విరిగిపోయాయి. ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

దీనిని కూడా చదవండి : PCC Chief Comments | ‘మీడియా’ కథనాలపై పీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *