అక్షరటుడే, కామారెడ్డి: Tractor Accident | అదుపు తప్పి చెరువు కట్టపై నుంచి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటన రామారెడ్డి మండల (Ramareddy Mandal) కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకోగా ఓ యువతి మృతి చెందింది.
Tractor Accident | చెరువు కట్టపై..
రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన నర్సింలు కుటుంబం గ్రామ సమీపంలోని బీరప్ప ఆలయం వద్ద పండగ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వీరంతా రామారెడ్డి నుంచి బీరప్ప ఆలయం వద్దకు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ట్రాక్టర్లో వెళ్లారు. పండగ పూర్తయ్యాక రాత్రి సమయంలో తిరిగి ట్రాక్టర్లో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో ట్రాక్టర్ పటేల్ చెరువు కట్టపై నుంచి అదుపుతప్పి కిందకు బోల్తా పడింది.
Tractor Accident | కుటుంబ సభ్యులకు తీవ్రగాయాలు..
ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్, అతని భార్య, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డికి, అక్కడినుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. అయితే చికిత్స పొందుతూ ట్రాక్టర్ డ్రైవర్ నర్సింలు కూతురు శ్రావ్య(17) మృతి చెందింది. ప్రస్తుతం శ్రావ్య ఇంటర్ మీడియట్ చదువుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదంతో రామారెడ్డి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి..: Santhosh Reddy Wife | మాజీ మంత్రి భార్య మృతి


