అక్షరటుడే, వెబ్డెస్క్ : Krishna River Barrage | తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై కొత్త బ్యారేజీతో పాటు వంతెన నిర్మాణానికి సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనపై విస్తృత చర్చలు జరిగాయి.
కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) ముందుకు తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టుపై తెలంగాణ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రతిపాదన ప్రకారం తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని కొల్పూర్ గ్రామం నుంచి, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా కోర్త్కుండా గ్రామం మధ్య కృష్ణానదిపై ఈ బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు జూరాల జలాశయానికి ఎగువన, కర్ణాటకలో ఇప్పటికే ఉన్న గుర్జాపూర్, గూగల్ చిన్న బ్యారేజీలకు దిగువన నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
Krishna River Barrage | శాశ్వత పరిష్కారం..
సుమారు రెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ బ్యారేజీ నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. ప్రాజెక్టు అమలులోకి వస్తే తెలంగాణలోని మక్తల్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో బ్యారేజీపై వంతెన నిర్మాణం కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానుంది. ప్రస్తుతం రాయచూరు సమీపంలోని శక్తినగర్-కృష్ణా మండలం మధ్య ఉన్న వంతెనపై అధిక ట్రాఫిక్ ఒత్తిడి నెలకొంటుండగా, కొత్త వంతెన అందుబాటులోకి వస్తే రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
Krishna River Barrage | ఇంజినీర్లతో సంయుక్త కమిటీ
ఇక మరో కీలక ప్రతిపాదనను కూడా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సమావేశంలో ప్రస్తావించింది. నారాయణపేట జిల్లా తంగడిగి గ్రామం, కర్ణాటకలోని సుగూరు గ్రామం మధ్య భీమా నదిపై చిన్న బ్యారేజీతో పాటు వంతెన నిర్మించాలని కోరింది. సుమారు 0.25 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. ఇది ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంత రైతులకు, ప్రజలకు ఉపయోగకరంగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణానది (Krishna River)పై ప్రతిపాదించిన ప్రధాన బ్యారేజీని రెండు రాష్ట్రాలు సంయుక్తంగా నిర్మించి వ్యయాన్ని సమానంగా పంచుకునే అవకాశంపై కూడా చర్చలు జరిగాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ అంతర్రాష్ట్ర ప్రాజెక్టు నిర్మాణ వ్యయం సుమారు రూ.500 కోట్ల వరకు ఉండవచ్చని నీటిపారుదల నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలు, ముంపు ప్రాంతాల అంచనాలు, హైడ్రాలజీ అంశాలను పరిశీలించేందుకు ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఇంజినీర్లతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో అధ్యయనం నిర్వహించి సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Dr K Laxman | తెలంగాణ బిడ్డకు కేంద్రంలో అరుదైన గౌరవం.. రాజ్యసభ హౌస్ కమిటీ ఛైర్మన్గా డా. కె. లక్ష్మణ్ నియామకం


