అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipality Debt | కామారెడ్డి మున్సిపాలిటీ అప్పుల ఊబిలో ఉందని, ఇప్పుడిప్పుడే అప్పుల నుంచి బయటపడుతోందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ అప్పులు తీరాలని, ఆదాయ మార్గాలు పెరగాలని, దానికోసం కౌన్సిల్ ప్రత్యేక తీర్మానాలు చేసి ఆదాయ మార్గాలు పెంచాలని సూచించారు.
కామారెడ్డి మున్సిపాలిటీలో సోమవారం నూతన పాలకవర్గ మొదటి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి హాజరయ్యారు. ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యకతన జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఆర్డీఓ, ఇంఛార్జి కమిషనర్ ఎన్ వై గిరి పాల్గొన్నారు.
Kamareddy Municipality Debt | సుదీర్ఘ చర్చ..
అజండా అంశాలపై చర్చించే ముందు మున్సిపాలిటీలో నెలకొన్న ముఖ్యమైన తాగునీరు, అప్పులు, ఆదాయ మార్గాలపై ఎమ్మెల్యే చర్చను లేవనెత్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐదు గంటల పాటు ఈ అంశాల పైనే సుదీర్ఘంగా చర్చ సాగింది.
మున్సిపాలిటీలో నెలకు రూ.1.74 కోట్ల లెక్కన ఏడాదికి రూ.20.95 కోట్ల ఖర్చు ఉందన్నారు. ఏడాదికి ప్రభుత్వ భవనాల ద్వారా రూ.9 కోట్లకు పైగా పన్నులు, రెసిడెన్షియల్ భవనాల ద్వారా 15.69 కోట్ల పన్నులు రావాల్సి ఉందన్నారు. మొత్తం రూ.24.21 కోట్ల పన్ను వసూలు రావాల్సి ఉండగా 2025-26 సంవత్సరానికి రూ.9.15 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయని అధికారులు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కౌన్సిలర్లు అనుకుంటే ప్రతి నెల రూ.కోటి వరకు ట్రేడ్ లైసెన్స్ ల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీకి రూ.45 కోట్ల అప్పు ఉందని, రూ.5 కోట్లు నిల్వ ఉన్నాయని తెలిపారు. రూ.15.20 కోట్ల విద్యుత్ బకాయిలు, రూ.30 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉందన్నారు.
మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ విభాగంలో ఎంత మంది ఉన్నారు..? ఎంత మంది పనిచేయడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించగా.. సుమారుగా 75 మంది రావడం లేదని అధికారులు తెలిపారు. నోటీసులిచ్చి వారిని తొలగించి కొత్తవారిని రిక్రూట్ చేసుకోవాలని ఆయన సూచించారు.
వయసు మళ్ళిన వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబాల నుంచి ఒక్కొక్కరిని తీసుకోవాలన్నారు. కామారెడ్డి పట్టణంలో తాగునీటి కొరత తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని అధికారులకు సూచించారు. మున్సిపాలిటీలో మొత్తం 580 బోర్లు ఉన్నాయని, వీటిలో 90 వరకు కమ్యూనిటీ బోర్లు ఉన్నాయని, కమ్యూనిటీ బోర్లకు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వాటిని ఇతర అవసరాలకు వినియోగించాలని అధికారులకు సూచించారు.
Kamareddy Municipality Debt | సరెండర్ పై చర్యలేవి: కౌన్సిలర్ హఫీజ్ భేగ్
గత బడ్జెట్ సమావేశాల్లో కమిషనర్, టీపీఓను సరెండర్ చేస్తూ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, కమిషనర్ను హెడ్ ఆఫీసుకు సరెండర్ చేసినా టీపీఓను ఎందుకు సరెండర్ చేయలేదని కౌన్సిలర్ హఫీజ్ భేగ్ ప్రశ్నించారు. టీపీఓ కామారెడ్డి పట్టణంలోనే ఉంటున్నారని, బిచ్కుందలో డ్యూటీ చేస్తున్నారని, కామారెడ్డిలో మాత్రం సెలవు పెట్టడంలో ఆంతర్యం ఏమిటన్నారు.
మళ్ళీ కామారెడ్డికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలపగా.. ఎమ్మెల్యే స్పందిస్తూ టీపీఓ ఇక్కడికి ఎట్టి పరిస్థితుల్లో రాడని స్పష్టం చేశారు. ఇక్కడికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పడం జరిగిందన్నారు. కౌన్సిల్ తీర్మానం చేసిన తర్వాత ఆయన మళ్ళీ వచ్చే అవకాశమే లేదన్నారు. అయితే ఇక్కడ ఇద్దరు టీపీఓలు ఉండగా ఒకరిని సిద్దిపేటకు డిప్యుటేషన్ వేశారన్నారు. ఆయన డిప్యుటేషన్ రద్దు చేసి ఇక్కడికి తీసుకురావాలని కౌన్సిల్ తీర్మానం చేస్తే అతను ఇక్కడికి వస్తాడని తెలిపారు.
Kamareddy Municipality Debt | శానిటేషన్ సమస్యను పరిష్కరించాలి : 15 వ వార్డు కౌన్సిలర్ సూరోజు వనిత
మున్సిపాలిటీలో శానిటేషన్ సమస్య తీవ్రంగా ఉందని, చెత్త వాహనాలు లేక ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోతోందని 15 వ వార్డు కౌన్సిలర్ సూరోజు వనిత తెలిపారు. తన వార్డులో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని, పెద్ద వార్డు కావడంతో ట్యాంకర్లు సరిపోవడం లేదన్నారు. తన వార్డులో బోర్లు వేసి ఫిల్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరగా.. అశోక్ నగర్, స్నేహపురి కాలనిలో నీటి నిల్వలు తక్కువని, అక్కడ ఫిల్ స్టేషన్ ఏర్పాటు చేయడం కుదరదని ఎమ్మెల్యే తెలిపారు.
Kamareddy Municipality Debt | డ్రైనేజీ సమస్య తీర్చండి – 46 వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణ
వార్డులో డ్రైనేజీ సమస్యతో రోడ్లపైకి నీళ్లు వస్తున్నాయని 46 వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణ తెలిపారు. ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. గత పాలకవర్గంలో రైల్వే కమాన్ వద్ద హైమాస్ లైట్స్ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం పని చేయడం లేదన్నారు. ఫలితంగా అక్కడ చీకటిగా ఉందని తెలిపారు. తక్షణమే అక్కడ హైమాస్ లైట్స్ ఏర్పాటు కోసం తీర్మానం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇది కూడా చదవండి: Bengal Young Voters | యువ ఓటర్ల చుట్టూ రాజకీయ హామీలు.. పశ్చిమ బెంగాల్లో వారే 40 శాతం

