అక్షరటుడే వెబ్డెస్క్: Delhi Restaurant Fire | దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం ఒక ఘోర విషాదం చోటుచేసుకుంది. మాల్వియా నగర్లోని ‘లెమన్ గ్రీన్’ రెస్టారెంట్లో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల వ్యవధిలోనే మంటలు రెస్టారెంట్ అంతటా వ్యాపించడంతో, అక్కడ ఉన్న సిబ్బంది, కస్టమర్లు అగ్నికీలల్లో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా, ఘటన స్థలంలో ఎగిసిపడుతున్న మంటలు, హృదయవిదారక దృశ్యాలు స్థానికులను తీవ్రంగా కలచివేసాయి.
Delhi Restaurant Fire | పెరిగిన మృతుల సంఖ్య..
ప్రమాదం జరిగిన మొదట్లో 10 మంది మరణించినట్లు సమాచారం రాగా, ఫైర్ సిబ్బంది , పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేసిన తర్వాత మరో పది మృతదేహాలను వెలికితీశారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 20 కి చేరింది. కాగా, అగ్నిమాపక, పోలీస్ అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రమాద స్థలం నుండి 35 మందిని సురక్షితంగా రక్షించి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందులో రెస్టారెంట్ సిబ్బంది కూడా సజీవదహనమవ్వడం తీవ్ర విషాదాన్ని నింపింది.

Delhi Restaurant Fire | ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి ..

ఈ ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ( Narendra Modi )తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటన తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొంటూ, మరణించిన వారి కుటుంబాలకు తన గాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులందరూ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బాధితులకు స్థానిక యంత్రాంగం, అధికారులు అన్ని విధాలా సాధ్యమైన సహాయాన్ని అందిస్తున్నారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. బాధితులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి ఎక్స్గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. ఈ అగ్నిప్రమాద ఘటనలో మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి (మృతుల వారసులకు) పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. దీనితో పాటు, ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులకు రూ. 50,000 చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రధాని కార్యాలయం (PMO) వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Pension Live Authentication | వినాయక్నగర్లో పింఛన్ లైవ్ అథెంటికేషన్
