అక్షరటుడే, కామారెడ్డి: Municipal Meeting | ‘ఎజెండా తయారు చేసే ముందు కనీస సమాచారం ఇవ్వరా..? ఇష్టం వచ్చిన అంశాలను ఎజెండాలో చేరుస్తారా..?’ అంటూ మున్సిపల్ ఛైర్పర్సన్పై కౌన్సిలర్లు (Municipal Council) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) సాధారణ సమావేశం ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి (Chairperson Umarani) అధ్యక్షతన కౌన్సిల్ హాలులో నిర్వహించారు.
Municipal Meeting | ప్రారంభమైన గంటలోపే..

సమావేశం మొదలైన గంటలోనే వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. సమావేశం సందర్భంగా పలువురు కౌన్సిలర్లు వార్డుల్లో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. గత కౌన్సిల్ సమావేశంలో తీర్మానించిన అంశాల పనితీరు ఎంతవరకు వచ్చిందో చెప్పాలని బీజేపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. గత కౌన్సిల్లో చేపట్టాల్సిన ఒక్క పని కూడా చేయకుండా కొత్తగా చేసిన ఎజెండా అంశాలను కౌన్సిలర్లకు చెప్పకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఇష్టం వచ్చిన పనులకు బిల్లులను ఆమోదించాలని ఎజెండాలో ఎలా పొందుపరుస్తారని నిలదీశారు.
Municipal Meeting | భారీ వర్షానికి డ్రైనేజీలు అస్తవ్యస్తం..
గురువారం కురిసిన వర్షానికి వార్డుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక రోడ్లపై నీళ్లు పారుతున్నాయని కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. కౌన్సిలర్లతో చర్చించిన తర్వాతే ఎజెండా తయారు చేయాలని అప్పటివరకు సమావేశం అవసరం లేదని అన్ని పార్టీల నాయకులు మూకుమ్మడిగా చెప్పారు. దాంతో ఛైర్పర్సన్ కౌన్సిల్ హాలు నుంచి బయటకు వెళ్లిపోవడం చర్చకు దారి తీసింది. కౌన్సిల్ సభ్యులు సమావేశం వద్దంటే ఛైర్పర్సన్ వెళ్లిపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమావేశం మధ్యలోనే ఆగిపోవడంతో వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దాంతో ఎజెండా అంశాలు ఒక్కటి కూడా ఆమోదానికి నోచుకోలేదు. అనంతరం కమిషనర్ ఛాంబర్లో అడిషనల్ కలెక్టర్ గిరితో కౌన్సిలర్లు సమావేశమయ్యారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను అదనపు కలెక్టర్కు వివరించారు.

ఇది కూడా చదవండి: HYDRAA Land Operation | కబ్జాదారులకు షాక్.. రూ. 30,000 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
