Harish Rao Revanth Reddy | హిట్లర్​కు పట్టిన గతే సీఎం రేవంత్​కు పడుతుంది : హరీశ్​రావు

హిట్లర్​కు పట్టిన గతే సీఎం రేవంత్​రెడ్డికి పడుతుందని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. పెద్దపల్లి పట్టణంలో ఆయన మాట్లాడారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao Revanth Reddy | నియంత హిట్లర్​కు పట్టిన గతే సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)కి పడుతుందని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) అన్నారు. పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ (BRS) ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

హిట్లర్​ను స్ఫూర్తిగా తీసుకొని హైడ్రా పెట్టిన అని రేవంత్ రెడ్డి అనడం ఆయన అహంకారానికి, నిరంకుశత్వానికి నిదర్శనమని హరీశ్ రావు విమర్శించారు. నాడు హిట్లర్ పేదలను ఊచకోత కోస్తే, నయా హిట్లర్ రేవంత్ రెడ్డి పేదల ఇళ్లను కూలుస్తూ వారి బతుకులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. హిట్లర్ దురాగతాలకు నేటికీ జర్మనీ క్షమాపణలు చెబుతున్నట్లే, భవిష్యత్తులో రేవంత్ రెడ్డి పాపాలకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు క్షమాపణలు చెప్పక తప్పదని హెచ్చరించారు.

Harish Rao Revanth Reddy | కాంగ్రెస్​ గెలవదు

రెండున్నరేళ్ల రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత, కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి అన్నారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. వడ్లు అమ్ముకోవడానికి రైతులు 45 రోజుల పాటు కల్లాల వద్ద పడిగాపులు కాశారని, నేటికీ 30శాతం వడ్లు కల్లాల్లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

Harish Rao Revanth Reddy | రైతు బంధుకు ఎగనామం

రైతుల మీద ప్రేమతో కేసీఆర్ రైతుబంధు తీసుకువచ్చారని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాసంగి పంటకు రైతుబంధు ఎగనామం పెట్టిందని హరీశ్​రావు విమర్శించారు. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల కొరతతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నాలుగు నెలలుగా ఎల్ఐసీకి ప్రీమియం కట్టకపోవడంతో రాష్ట్రంలో 3 వేల మంది రైతులు చనిపోయినా రైతు బీమా రావడం లేదన్నారు.

Harish Rao Revanth Reddy | వారిని చేర్చుకోం

brs 3

కష్టకాలంలో పార్టీని వీడి వెళ్లిన వారిని మళ్లీ తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని హరీశ్​రావు అన్నారు. ఈ క్లిష్ట సమయంలో అండగా నిలబడ్డ కార్యకర్తలే తమకు దేవుళ్లని, వారిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపేలా నాయకులందరూ విభేదాలు పక్కనపెట్టి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.

Harish Rao Revanth Reddy | అడ్డుకున్న పోలీసులు

సింగరేణి పరిరక్షణ సదస్సులో పాల్గొనేందుకు రామగుండం చేరుకున్న హరీశ్​రావును పోలీసులు అడ్డుకున్నారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లో బొగ్గు నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బీఆర్ఎస్​ నాయకులు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసు అధికారుల తీరుతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.

 


దీనిని కూడా చదవండి : Vaikunthanath Behera Assets | రూ.6 వేల జీతంతో ఉద్యోగం ప్రారంభం.. రూ.వందల కోట్ల ఆస్తులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *