అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Monsoon Arrival | అన్నదాతలకు వాతావరణ శాఖ (Meteorological Department) గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. కొంతకాలంగా ఎండలు మండుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అక్కడక్కడ అకాల వర్షాలు కురిసిన ఎండలు తగ్గకపోవడంతో ఉపశమనం లభించలేదు. దీంతో ప్రజలు తొలకరి పలకరింపు కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో నైరుతి రాకతో రాష్ట్రంలో తొలకరి జల్లులు కరిశాయి. వాతావరణం చల్లబడింది.
తెలంగాణను నైరుతి రుతుపవనాలు సోమవారం తాకాయి. గద్వాల జిల్లాలోకి ప్రవేశించాయి. రెండు, మూడు రోజుల్లో రాష్ట్రం అంతటా రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందన్నారు. కాగా ఉదయం నుంచే పలు జిల్లాలో భారీ వర్షం (Heavy Rain) కురిసింది. వాతావరణం చల్లబడింది. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు.. ఏపీ, మహారాష్ట్రలో 30శాతం విస్తరించాయి. మరోవైపు బంగాళాఖాతంలో పూర్తిగా వ్యాపించినట్లు అధికారులు పేర్కొన్నారు.
Telangana Monsoon Arrival | ఎల్నినో ప్రభావం
ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా సాధారణం కంటే వర్షపాతం కొంత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాలో లోటు వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. మధ్య తెలంగాణలో సాధారణ వర్షాలు కురుస్తాయని, ఉత్తర, దక్షిణ తెలంగాణలో తక్కువ పడుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు రైతులు సాగు ప్రణాళికలు రూపొంచించుకోవాలని అధికారులు సూచించారు.
Telangana Monsoon Arrival | సాగు పనుల్లో బిజీ

నైరుతి ఆగమనంతో అన్నదాతలు సాగు పనుల్లో బిజీ అయ్యారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దుక్కులు దున్నారు. కొంతమంది తుకాలు కూడా పోశారు. తొలకరి పలకరింపుతో తాజాగా వ్యవసాయ పనులు జోరందుకోనున్నాయి. ఇప్పటికే అన్నదాతలు ఎరువులు, విత్తనాల కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆయా దుకాణాలు నిత్యం కళకళలాడుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Kishan Reddy Counter | సింగరేణిపై కేటీఆర్కు కిషన్రెడ్డి కౌంటర్
