అక్షరటుడే, కామారెడ్డి: Drunk Driving | డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన మందుబాబులకు కోర్టు షాకిచ్చింది. పట్టుబడిన 62 మందిలో 10 మందికి జరిమానాతో పాటు జైలుశిక్ష విధించింది. జిల్లావ్యాప్తంగా చేపట్టిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 62 మందికి కోర్టు మొత్తం రూ.73,500 జరిమానా విధించింది.
Drunk Driving | మద్యం మత్తులో..
మద్యంమత్తులో వాహనాలు నడిపి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించిన 8 మందికి ఒక రోజు, ఒకరికి రెండు రోజులు, మరొకరికి మూడు రోజుల జైలు శిక్ష పడింది. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపితే భవిష్యత్తే ప్రమాదమని, ఒక్క క్షణం అజాగ్రత్త జీవితాంతం విషాదం మిగులుస్తుందని హెచ్చరించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కుటుంబసభ్యులు చెప్పే జాగ్రత్త అనే మాట వెనుక క్షేమంగా తిరిగి రావాలనే అర్థం ఉందని, రోడ్డుపై చేసే చిన్న అజాగ్రత్త ఆ ఎదురుచూపులను శాశ్వత విషాదంగా మారుస్తుందన్నారు.
Drunk Driving | క్షణికానందం కోసం..
క్షణికానందం కోసం మద్యం తాగి డ్రైవ్ చేసి మీతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని ఎస్పీ (Kamareddy Police) సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే భారీ జరిమానాలు, జైలు శిక్షతో పాటు భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక గౌరవంపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం తాగినప్పుడు స్వయంగా వాహనం నడపకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్పీ కోరారు. ప్రజల ప్రాణ రక్షణే తమ లక్ష్యమని, సురక్షిత ప్రయాణంతో క్షేమంగా ఇంటికి చేరాలని ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి: Hyderabad Traffic Restrictions | వాహనదారులకు అలర్ట్.. రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
