అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Rain Traffic | హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా, అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా, గ్లోబల్ ఐటీ హబ్గా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ప్రకటిస్తోంది. తాజాగా ఫ్యూచర్ సిటీ అథారిటీ డెవలప్మెంట్ కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
విదేశీ కంపెనీలను ఆకర్షించడం, పెట్టుబడులు తీసుకురావడం, కొత్త టవర్లు, ఫ్లైఓవర్లు, స్కైవేలు నిర్మించడం వంటి అంశాలపై భారీ ప్రచారం జరుగుతోంది. కానీ నేలమీద పరిస్థితులు చూస్తే మాత్రం మరో వాస్తవం కనిపిస్తోంది.
జూన్ 9న కేవలం గంటసేపు కురిసిన వర్షానికే హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైపోవడం ఆ వాస్తవాన్ని మరోసారి బహిర్గతం చేసింది. ముఖ్యంగా దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ఐటీ కారిడార్గా చెప్పుకొనే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం, కోకాపేట ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
దీనికితోడు వర్షాల కారణంగా భాగ్యనగరంలో ఇద్దరు యువకులు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. ఫ్యూచర్ సిటీ వెంట పడుతూ.. ఉన్న సిటీని విస్మరిస్తున్నారా..? అనే ప్రశ్నలను నగరవాసులు లేవనెత్తుతున్నారు.
సాధారణంగా 20 నిమిషాల్లో పూర్తయ్యే ప్రయాణం కోసం ఐటీ ఉద్యోగులు నాలుగు నుంచి ఆరు గంటల వరకు రోడ్లపైనే చిక్కుకుపోవాల్సి వచ్చింది. లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్నామని చెప్పుకొనే హైదరాబాద్లో చిన్న వర్షానికే జీవనం స్తంభించిపోవడం నగర ప్రణాళికలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Hyderabad Rain Traffic | గాజు భవనాలు.. గతుకుల రోడ్లు..
ఐటీ కారిడార్లో రోజురోజుకు భారీ భవనాలు పెరుగుతున్నాయి. వందల ఎకరాల్లో కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. వేలాది కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది. ఎకరం భూమి ధర రూ.230 కోట్లు పలుకుతోంది.
అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు రూ.2 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు, విల్లాలు రూ. 10 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు చెబుతున్నారు. ఇక ఓపెన్ ప్లాట్లు అయితే గజం ధర రూ. 2 లక్షల పైమాటే..
కానీ, అదే వేగంతో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, ప్రజా రవాణా సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయా.. అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు.
ఒక వైపు ప్రపంచ స్థాయి కార్యాలయాలు, మరోవైపు మోకాళ్ల లోతు నీటితో నిండిపోయే రోడ్లు. ఒక వైపు విదేశీ పెట్టుబడులపై సదస్సులు, మరోవైపు గంటల తరబడి కదలని ట్రాఫిక్. ఈ విరుద్ధ పరిస్థితులు నగర అభివృద్ధి నమూనాపైనే సందేహాలు కలిగిస్తున్నాయి.
Hyderabad Rain Traffic | “గ్లోబల్ సిటీ”.. ప్రాథమిక సమస్యల నిలయం?
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ను ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలబెడతామని చెబుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో హైదరాబాద్ను మరింత ఆకర్షణీయ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
అయితే నగరవాసులు అడుగుతున్న ప్రశ్న మాత్రం చాలా సాధారణమైనది.. “అంతర్జాతీయ నగరం గురించి మాట్లాడే ముందు, ప్రతిరోజు ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించలేరా?”
ప్రపంచంలోని ప్రముఖ నగరాలు కేవలం ఆకాశహర్మ్యాలతో అంతర్జాతీయ స్థాయికి చేరలేదు. అక్కడి రవాణా వ్యవస్థ, వరద నీటి నిర్వహణ, నగర ప్రణాళిక, ప్రజా సౌకర్యాలే వాటి విజయానికి పునాది.
హైదరాబాద్లో మాత్రం ప్రతి వర్షాకాలంలో అదే సమస్యలు, అదే ట్రాఫిక్ జామ్లు, అదే ఇబ్బందులు పునరావృతమవుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు.
Hyderabad Rain Traffic | గత ప్రభుత్వంపై విమర్శలు… ప్రస్తుత సర్కారు బాధ్యత ఏది..?
ఈ పరిస్థితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే కారణమని కాంగ్రెస్ నేతలు తరచూ ఆరోపిస్తున్నారు. నగర విస్తరణ సమయంలో సరైన డ్రైనేజీ, మౌలిక వసతుల ప్రణాళికలు అమలు కాలేదని చెబుతున్నారు.
అయితే, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్న ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది.
గత పాలకుల తప్పులను ఎత్తిచూపడం అటుంచితే.. మరి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏమి చేస్తోందని.. మహా నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.
ప్రతి ఏడాది వర్షాకాలం వస్తుందని తెలిసినప్పటికీ ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టడం లేదు? ఐటీ కారిడార్ వంటి కీలక ప్రాంతాలకు ప్రత్యేక ట్రాఫిక్, డ్రైనేజీ ప్రణాళికలు ఎందుకు అమలు చేయడం లేదు? ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవే.

Hyderabad Rain Traffic | ఐటీ ఉద్యోగుల జీవితం… రోజూ ట్రాఫిక్తో యుద్ధమే
హైదరాబాద్ ఐటీ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం. కోట్లాది రూపాయలు పన్నుల రూపంలో వస్తోంది. రాష్ట్ర ఆదాయంలో 60 శాతం ఇక్కడి నుంచే వస్తోంది.
దీనికితోడు లక్షలాది మంది యువత ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. కానీ, ప్రతిరోజు కార్యాలయాలకు వెళ్లడం, తిరిగి ఇంటికి చేరుకోవడం ఉద్యోగులకు ఒక మానసిక పరీక్షగా మారుతోంది.
వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. కార్లు, బస్సులు, క్యాబ్లు గంటల తరబడి నిలిచిపోవడం, ఆహారం లేక ఇబ్బంది పడటం, కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోవడం, ఇంటికి ఎప్పుడు చేరతామో తెలియని పరిస్థితి నెలకొంటోంది.
ప్రత్యేకించి మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే ఇబ్బందులు మరింత క్లిష్టంగా ఉంటున్నాయి. ఆరోగ్య సమస్యలు, భద్రతా ఆందోళనలు, రాత్రి వేళల్లో ప్రయాణాలు వారి బాధలను మరింత పెంచుతున్నాయి.
Hyderabad Rain Traffic | తల్లిదండ్రుల ఆందోళనను ఎవరు అర్థం చేసుకుంటారు?
రాత్రి 8 గంటలకు ఇంటికి చేరాల్సిన కుమార్తె అర్ధరాత్రి అయినా ఇంటికి రాకపోతే…
ఫోన్ బ్యాటరీ అయిపోయి స్విచ్ ఆఫ్ అయితే…
ట్రాఫిక్లో చిక్కుకుపోయిందని తెలిసినా, క్షేమంగా ఉందో లేదో తెలియని పరిస్థితిలో తల్లిదండ్రులు పడే ఆందోళనను ఏ గణాంకం చెప్పలేదు.
ఇది కేవలం ట్రాఫిక్ సమస్య కాదు. ఇది వేలాది కుటుంబాల మానసిక వేదనకు సంబంధించిన అంశం.
Hyderabad Rain Traffic | హైదరాబాద్ ప్రతిష్ఠకు ముప్పుగా మారుతున్న ట్రాఫిక్
ఒక నగరాన్ని అంచనా వేయడానికి అక్కడి ఎత్తైన భవనాలు మాత్రమే ప్రమాణం కావు. ప్రజలు ఎంత సౌకర్యంగా జీవిస్తున్నారు? ఎంత వేగంగా ప్రయాణించగలుగుతున్నారు? అత్యవసర సమయంలో వ్యవస్థ ఎలా స్పందిస్తోంది? అనే అంశాలే అసలు ప్రమాణాలు.
ప్రతి వర్షానికి ట్రాఫిక్ స్తంభించడం, గంటల తరబడి ప్రజలు రోడ్లపైనే చిక్కుకుపోవడం, వరద నీరు రోడ్లను ముంచెత్తడం వంటి ఘటనలు హైదరాబాద్ అంతర్జాతీయ ప్రతిష్ఠపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెట్టుబడిదారులు కేవలం భవనాలను మాత్రమే చూడరు. నగర మౌలిక వసతులను కూడా పరిశీలిస్తారు. ఉద్యోగులు జీవించడానికి అనువైన నగరమా కాదా అనేది కూడా సంస్థలు పరిగణనలోకి తీసుకుంటాయి.
Hyderabad Rain Traffic | ప్రచారాల కంటే పరిష్కారాలే ముఖ్యం
హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చాలంటే భారీ ప్రకటనలు, ఆకర్షణీయ ప్రెజెంటేషన్లు, విదేశీ పర్యటనలు మాత్రమే సరిపోవు.
ప్రజలు కోరేది చాలా సాధారణమైనవి.
- వర్షం పడితే రోడ్లు మునగకూడదు.
- ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోకూడదు.
- ఉద్యోగులు సురక్షితంగా, సమయానికి ఇళ్లకు చేరుకోవాలి.
- తల్లిదండ్రులు తమ పిల్లల కోసం అర్ధరాత్రి వరకు ఆందోళన చెందకూడదు.
ఈ ప్రాథమిక లక్ష్యాలను సాధించలేకపోతే “అంతర్జాతీయ నగరం” అనే నినాదం ప్రజలకు కేవలం ప్రచార వాక్యంగానే మిగిలిపోతుందనే అభిప్రాయం నగరవాసుల్లో వ్యక్తమవుతోంది.
హైదరాబాద్ ప్రపంచ నగరంగా ఎదగాలంటే ముందుగా తన ప్రజలకు సౌకర్యవంతమైన నగరంగా మారాల్సిన అవసరం ఉందని నగరవాసులు స్పష్టం చేస్తున్నారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న అసలైన సవాలు.
Kerala fake study certificates | “డిగ్రీల దుకాణం”: చదివినవాడు నిరుద్యోగి… ముద్రించేవాడు నిపుణుడు!
