SIR Training | ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తతే శ్రీరామరక్ష..: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తతే శ్రీరామరక్ష అని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని ప్రభుత్వ సలహాదారు అలీ షబ్బీర్ అలీ అన్నారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: SIR Training | ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తతే శ్రీరామరక్ష అని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, దానిని కాపాడటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. బుధవారం కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్‌లో ఎస్​ఐఆర్​ శిక్షణలో ఆయన మాట్లడారు.

SIR Training | ఎన్నికలను ప్రభావితం చేసేలా బీజేపీ..

ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేకంగా ముద్రించిన బుక్‌లెట్లను బీఎల్‌ఏలు, నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక ఓటర్ల పేర్లను తొలగిస్తూ, బోగస్ ఓట్లను సృష్టించి అనైతిక లబ్ధి పొందేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రయత్నాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఇతర బలహీన వర్గాల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి బూత్ పరిధిలో బీఎల్‌ఏలు చురుగ్గా పనిచేస్తూ స్థానిక కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. అర్హులైన యువతను కొత్త ఓటర్లుగా నమోదు చేయించి వారి ఓటు హక్కు కల్పించాలని కోరారు.

SIR Training | 45ఏళ్లుగా కాంగ్రెస్​ పార్టీకి సైనికుడిలా..

తాను గత 45 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి, గాంధీ (Gandhi) కుటుంబానికి సాధారణ సైనికుడిలా సేవలందిస్తున్నానని షబ్బీర్ అలీ గుర్తుచేశారు. రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలు, ఒత్తిడులు, ప్రలోభాలు ఎదురైనా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు సాగానని తెలిపారు. నలుగురు ముఖ్యమంత్రుల మంత్రివర్గాల్లో పనిచేసిన అనుభవంతో కార్యకర్తల సంక్షేమం, పార్టీ బలోపేతం కోసం కృషి చేశానని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో నేటి కార్యకర్తలు వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

రాబోయే ఎన్నికల్లో ఓటరు జాబితాల పరిశీలన అత్యంత కీలకమని, ప్రతి కార్యకర్త తన పరిధిలోని ప్రతి కుటుంబాన్ని సంప్రదించి ఎవరి ఓటు కూడా గల్లంతు కాకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్​ శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఐరేని సందీప్, ఆయన మండలాల అధ్యక్షులు నరేందర్ రెడ్డి, రాజా గౌడ్, రమేష్ గౌడ్, నౌసిలాల్, ఆశ బోయిన శ్రీనివాస్, అంకం కృష్ణారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, గోనె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy Cases | సీఎం రేవంత్ క్వాష్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్.. ఉత్కంఠగా హైకోర్టు నిర్ణయం

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *