అక్షరటుడే, ఎల్లారెడ్డి: Urea App Protest | యూరియా యాప్ను వెంటనే రద్దుచేసి రైతులకు కావాల్సిన ఎరువులను సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ‘రైతు దీక్ష’ నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
Urea App Protest | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర
ఈ సందర్భంగా నల్లమడుగు సురేందర్ (Nallamadugu Surender) మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం కలిసి అన్నదాతలపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే చర్యలు తీసుకుంటున్నారని, యూరియా దొరకకుండా చేసి రైతులు సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. యూరియా యాప్ (Urea App) చదువుకున్న వాళ్లకే అర్థం కావడం లేదని.. ఇక సాధారణ రైతుకు ఏం అర్థమవుతుందని ప్రశ్నించారు. అంతేకాకుండా రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేకపోవడం వల్ల బుక్ చేసుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణలోనే ఈ యాప్ ఎందుకు పెట్టారని నిలదీశారు. మార్కెట్లో యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ఎరువులు తెప్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
Urea App Protest | రైతు బీమా పథకం ఉందా లేదా..?
రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం సకాలంలో కట్టకపోవడంతో మృతి చెందిన రైతుల కుటుంబాలకు బీమా డబ్బులు రావడంలేదని సురేందర్ పేర్కొన్నారు. ప్రస్తుతం రైతు బీమా పథకం ఉందా లేదా అనే విషయమే అర్థం కావడం లేదన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన పథకాలను కనుమరుగు చేయాలని చూస్తే, ప్రజలు కాంగ్రెస్ నాయకులను కనుమరుగు చేస్తారని హెచ్చరించారు. వెంటనే యూరియా సరఫరా చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా విషయమై పోలీసులు వ్యవసాయ అధికారులు వచ్చి సమాధానం చెప్పడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు (Farmers) పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Mobile Recovery | మొబైల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి రాష్ట్రానికే ఆదర్శం: ఎస్పీ రాజేష్ చంద్ర