అక్షరటుడే, ఆర్మూర్: Jeevan Reddy Criticism | రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోందని.. హామీలిచ్చి మరిచిన కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టాలని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. రైతుల సమస్యలపై స్పందిస్తూ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు.
Jeevan Reddy Criticism | రేవంత్రెడ్డి కాదు.. హిట్లర్ రెడ్డి..
ఈ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాదు హిట్లర్ రెడ్డి అని ఆరోపించారు. రేవంత్రెడ్డి మోదీ, బాబు కనుసైగల్లో పని చేస్తున్నారని జీవన్రెడ్డి ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సినిమాలు హిట్ అయినంత మాత్రాన సీఎం అవుతానని అనుకుంటే అది భ్రమేనని అన్నారు. పాన్ డబ్బాల లెక్క పది పార్టీలు పుడితే అందులో ఒక తోక పార్టీ జనసేన పార్టీ అని విమర్శించారు. తమ కౌన్సిలర్లకు ప్రోటోకాల్ ఇవ్వకుంటే 2000 మందితో మున్సిపాలిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు.తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ (KCR) రైతు మిత్రుడిగా రైతు బంధు అందిస్తే, రేవంత్ రెడ్డి బూతుబంధుగా మారారని అన్నారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగుల పాలిట రేవంత్ రెడ్డి ఒక హిట్లర్లా మారాడని విమర్శించారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదని, హిట్లర్ రాజ్యంగా, ఎమర్జెన్సీ రాజ్యంగా మార్చారని ఆరోపించారు.
Jeevan Reddy Criticism | బీఆర్ఎస్ హయాంలో..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచామని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు. ఎకరానికి రెండు యూరియా బస్తాలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం కొత్త సర్క్యులర్ తీసుకువచ్చిందని, వాటిని కూడా విడతల వారీగా ఇస్తామని చెప్పడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. కేసీఆర్ హయాంలో అవసరమైన ఎరువులు రైతుల ఇంటి వద్దకే చేరేవని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులంటే ఎందుకు ఇంత చిన్నచూపు అని ప్రశ్నించారు. వడ్లు, మక్కలు, జొన్నలు కొనుగోలు చేయకపోతే కాంగ్రెస్ నాయకుల ఇళ్ల ముందు రైతులతో కలిసి పంటలను పారబోస్తామని హెచ్చరించారు.
Jeevan Reddy Criticism | ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చినవి బూటకపు హామీలు
ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్మూర్ (Armoor) ప్రాంతంలో ఎర్రజొన్నల డబ్బులు రైతులకు అందకపోయిన సమయంలో రైతుల కోసం నిరాహార దీక్ష చేసి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.13 కోట్లు చెల్లింపులు జరిగేలా చేసిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడే రైతు డిక్లరేషన్ను బొందపెట్టారని విమర్శించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో అన్ని పంటలు కొనుగోలు చేస్తామని చెప్పి, ఇప్పుడు కేంద్రం ఎంత కొనమంటే అంతే కొంటామని చెప్పడం మాట తప్పడమేనన్నారు. ఎంత పంట పండితే అంత పంట కొనుగోలు చేస్తామని అనేక సందర్భాల్లో చెప్పి, ఇప్పుడు మాట మార్చడం రైతులను మోసం చేయడమేనని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, పట్టణ అధ్యక్షుడు పూజ నరేంధర్, మాజీ జడ్పీటీసీ సంతోష్, పట్టణ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: MLA KVR | రైతుబీమా పథకాన్ని నిర్వీర్యం చేయడం బాధాకరం: ఎమ్మెల్యే కేవీఆర్