అక్షరటుడే, వెబ్డెస్క్: Kavitha Allegations | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాల్లోని రూ.1400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చారని ఆమె ఆరోపించారు.
కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) బాయి బాట కార్యక్రమంలో భాగంగా గురువారం కొత్తగూడెంలోని పీవీకే5 గనిని పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ బ్యాంకు ఖాతాల్లోని రూ.1,400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి క్విడ్ ప్రోకో ద్వారా వచ్చాయన్నారు. అది అవినీతి సొమ్ము, దానిని తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
Kavitha Allegations | బీఆర్ఎస్లో చేరను
ప్రదీప్ కన్స్ట్రక్షన్ విషయంలో క్విడ్ ప్రోకో విధానంలో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని కవిత ఆరోపించారు. తాను బతికున్నంత కాలం బీఆర్ఎస్లో చేరనని స్పష్టం చేశారు. కేటీఆర్ రూ.188 కోట్లు పెట్టి ది పయనీర్ అనే ఇంగ్లిష్ పత్రికను కొనుగోలు చేశారన్నారు. అందులో వచ్చే వార్తలు నమ్మొద్దని సూచించారు. ఫీనిక్స్ను కేటీఆర్, హరీష్ రావు పోషించి, రక్షించలేదా అని కవిత ప్రశ్నించారు. ఈ ఫీనిక్స్ అనే వ్యక్తి ఎవరు? అతను తెలంగాణకు చెందినవాడా లేక ఆంధ్రకు చెందినవాడా అన్నారు. ఈ సంస్థ 33 లక్షల టన్నుల కలపను నరికిందన్నారు.
Kavitha Allegations | అవినీతి అనకొండ హరీశ్రావు
కాళేశ్వరంలో అవినీతి అనకొండ హరీశ్రావు అని కవిత ఆరోపించారు. గుంటనక్కను ముందు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ జన్మలో బాగు పడదని, అధికారంలోకి రాదన్నారు. తన పార్టీపై బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సంఘానికి వెయ్యి ఫిర్యాదులు చేశారన్నారు. తన పార్టీతో భయం లేదన్న నాయకులు.. ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. తన వార్తలు వేయకుండా బీఆర్ఎస్ నాయకులు మీడియా సంస్థలకు ఫోన్లు చేస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావు కంపెనీ శ్రీ చైతన్య విద్యాసంస్థలకు పాలు సరఫరా చేస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన అన్ని భూములను తాము అధికారంలోకి వచ్చాక సమీక్షిస్తామన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెట్టిన ప్రతి అడుగు స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.
Kavitha Allegations | కార్మికుల సమస్యలపై పోరాటం
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాము కృషి చేస్తామని కల్వకుంట్ల కవిత తెలిపారు. ఓపెన్ కాస్ట్ గనులతో పాటు అండర్ గ్రౌండ్ మైన్లను నడపాలన్నారు. భూగర్భ గనులతో ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయని తెలిపారు. కార్మికుల హక్కల కోసం తమ పార్టీ పని చేస్తుందన్నారు. గనిలోపలికి వెళ్లే కార్మికులకు అధికారులు పనిముట్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ బొగ్గు గనులను టెండర్ లేకుండా సింగరేణికి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సత్తుపల్లిలో సీఎం రేవంత్రెడ్డి బావమరిదికి ఓపెన్ కాస్ట్ గని ఉందని కవిత పేర్కొన్నారు. అందులో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని విమర్శించారు. తెలంగాణ రాకముందు సింగరేణిలో 62 వేల మంది కార్మికులు పని చేస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 38 వేలకు తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Kavitha Allegations | నిరాహార దీక్ష చేస్తాం
ప్రతి నెలా మెడికల్ బోర్డు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. అన్ఫిట్ అయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్చేశారు. ఈ నెల 20వ తేదిలోపు మెడికల్ బోర్డుపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే తాను నిరవదిక నిరాహార దీక్ష చేస్తానని కవిత ప్రకటించారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు విషయంలో న్యాయం తనవైపు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఏ పేరు వచ్చినా తాను మాత్రం ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్లు తనపై పోస్టులు పెట్టే బీఆర్ఎస్ నాయకులకు కవిత వార్నింగ్ ఇచ్చారు.బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బూతులు తిట్టడం, ఎటు పడితే అటు మాట్లాడితే తాను చూస్తూ ఊరుకోనన్నారు.
ఇది కూడా చదవండి..: Gurukul Food Poisoning | గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 26 మంది విద్యార్థులకు అస్వస్థత