అక్షరటుడే, ఇందూరు: Enumeration Forms | ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను తిరిగి బీఎల్వోలకు అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఓటర్లకు సూచించారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డితో కలిసి ఆమె వీసీలో మాట్లాడారు.వీ.సీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ.ఆర్.ఓలు, ఏ.ఈ.ఆర్.ఓలు, సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు.
Enumeration Forms | డిజిటలైజేషన్ చేయాల్సి ఉన్నందున..
వివరాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉన్నందున, నిర్ణీత గడువు వరకు వేచి చూడకుండా వెనువెంటనే ఫారాలను నింపి బీఎల్వోలకు సమర్పించాలని ఓటర్లను కోరారు. ఓటర్ల నుండి ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, వాటి వివరాలను డిజిటలైజ్ చేయడంలో వెనుకంజలో ఉన్న సూపర్ వైజర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పురోగతి చూపని నిజామాబాద్ అర్బన్ పరిధిలోని ముగ్గురు సూపర్వైజర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఐఆర్ అమలు తీరును తేలికగా తీసుకోరాదని, నిర్ణీత గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయని వారిపై ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
Enumeration Forms | గడువు సమీపించిన దృష్ట్యా..

గడువు సమీపించిన దృష్ట్యా శని, ఆదివారాలు సెలవు దినాల్లో కూడా పని చేయాలని తేల్చి చెప్పారు. వచ్చే సోమవారం నాటికి అర్బన్లో 35శాతం, రూరల్ నియోజకవర్గాల పరిధిలో 50శాతం ప్రక్రియ పూర్తి కావాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు కూడా క్షేత్రస్థాయిలో ఉంటూ, ఎన్యూమరేషన్ ఫారంల సేకరణ, వాటి డిజిటలైజేషన్ ప్రక్రియలు వేగవంతం అయ్యేలా పర్యవేక్షణ జరపాలని, రోజువారీ ప్రగతిని తనకు నివేదించాలని ఆదేశించారు. బీఎల్ఓలకు సహకారం అందించేలా వీఓఏలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులతో కూడిన వారిని వలంటీర్లుగా నియమించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఓటర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఎన్యుమరేషన్ ఫారాలు సరైన విధంగా పూరించడంలో వారికి సహకరించాలని హితవు పలికారు.
Enumeration Forms | ప్రతి బీఎల్వో వద్ద ఫొటోలతో..
ప్రతి బీఎల్ఓ వద్ద ఫొటోలతో కూడిన ఓటరు జాబితా తప్పనిసరిగా ఉండాలన్నారు. వివరాల పరిశీలన సమయంలో అందుబాటులో లేని, చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన, రెండు చోట్ల ఓటు కలిగిన ఓటర్ల పేర్లను గుర్తిస్తూ పక్కాగా జాబితాను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ జాబితాపై రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని సూచించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బీఎల్ఏలు స్థానికంగా అందుబాటులో ఉంటూ, ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు బీఎల్ వోలకు తగిన సహకారం అందించాలన్నారు. కాగా, ఎన్యూమరేషన్ ఫారాలు అందించే విషయంలో ఓటర్లు తాత్సారం చేయకుండా, వెంటనే ఫారాలను వివరాలతో నింపి బీఎల్ఓలకు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, విజయలక్ష్మి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Badi Bata 2026 | విజయవంతంగా ‘బడిబాట’.. ఈ ఏడాది సత్తా చాటిన కామారెడ్డి జిల్లా