అక్షరటుడే, మునీరాబాద్: TRS Panchajanyam | తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తూ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తన నూతన పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) కార్యచరణను ప్రకటించారు. మునీరాబాద్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె తన రాజకీయ భవిష్యత్తు దిశానిర్దేశాన్ని ‘పాంచజన్యం’ పేరుతో వెల్లడించారు. సమాజంలోని అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఐదు ప్రధాన హామీలను ఆమె ఈ సందర్భంగా ప్రజల ముందుకు తెచ్చారు.
TRS Panchajanyam | కవిత ప్రకటించిన ‘పాంచజన్యం’ అస్త్రాలు ఇవే:
ఉచిత విద్య – కేజీ టు పీజీ: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తామని కవిత హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలే కాకుండా, ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తామని స్పష్టం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం విద్యావ్యవస్థను విస్మరించాయని ఆమె విమర్శించారు.
ఉచిత చికిత్స: వైద్యం కోసం పేదవాడు ఆస్తులు అమ్ముకోకూడదనే లక్ష్యంతో.. సర్కారీ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏ జబ్బుకైనా పైసా ఖర్చు లేకుండా ఉచిత చికిత్స అందిస్తామని ప్రకటించారు.
రైతులకు ప్రాధాన్యత: రైతు సంక్షేమం కేవలం మాటలకే పరిమితం కాకూడదని, ప్రభుత్వ కార్యాలయాల్లో, బ్యాంకుల్లో రైతులకు అత్యున్నత ప్రాధాన్యత, గౌరవం దక్కేలా చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
యువతను పారిశ్రామికవేత్తలుగా: కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే వేచి చూడకుండా, యువతను పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని కవిత తెలిపారు. స్వయం ఉపాధి కోసం రూ. 2 లక్షల నుండి ఏకంగా రూ. 20 కోట్ల వరకు రుణాలు ఇప్పించే బాధ్యత తమ పార్టీ తీసుకుంటుందని వెల్లడించారు.
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు: రాజకీయంగా పెను సంచలనం సృష్టిస్తూ బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కవిత ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకోవడమే ‘సామాజిక తెలంగాణ’ లక్ష్యమని ఆమె వివరించారు.
TRS Panchajanyam | “నేను మీ జేబు చూడను.. బాగోగులు చూస్తాను”:
సభలో కవిత అత్యంత భావోద్వేగంగా ప్రసంగించారు. తనను తాను ఒక తల్లి స్థానంలో ఉంచుకుని ప్రజలకు భరోసా ఇచ్చారు. “నేను మీ జేబులు చూడను.. ఒక అమ్మలా మీ బాగోగులు చూసుకుంటాను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సభికులను ఆకట్టుకున్నాయి. తమ పార్టీ కేవలం ఎన్నికల కోసం కాదని, ప్రజల కష్టాల్లో తోడుండే ఒక ‘సేన’ అని ఆమె పునరుద్ఘాటించారు.
TRS Panchajanyam | ప్రభుత్వాలకు ధీటుగా:
కవిత ప్రకటించిన ఈ ‘పాంచజన్యం’ హామీలు అటు సంక్షేమాన్ని, ఇటు సామాజిక సమీకరణాలను సమపాళ్లలో కలిపి రూపొందించినట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు , ఉచిత ప్రైవేటు విద్య వంటి అంశాలు రాజకీయంగా పెద్ద చర్చకే దారితీసే అవకాశం ఉంది. అటు అన్న కేటీఆర్, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాలకు ధీటుగా కవిత తన రాజకీయ ముద్రను వేయడానికి సిద్ధమయ్యారు.
ఇది కూడా చదవండి..: Kavitha | తెలంగాణ ‘అమ్మ’గా కవిత.. గులాబీ కోటలో మరో జయలలిత పుట్టుకొస్తుందా?

