అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR Sensational Comments | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy)పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. తాను కేసీఆర్ అంత మంచొడిని కాదని చెప్పారు.
మరో 28 నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. అప్పుడు ఈరోజు తోకలు ఊపుతున్న అధికారులకు మిత్తితో సహా తిరిగి ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు. రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల దాకున్నా గుంజుకొచ్చి ప్రజల ముందు పెడతామన్నారు.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో రైతు సదస్సుకు కేటీఆర్ మంగళవారం హాజరయ్యారు. ఇటీవల ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. లక్షెట్టిపేటలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పంట కొనకపోవడంతో గోడ రైతులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేసినా.. దున్నపోతు మీద వాన పడ్డట్లు ప్రభుత్వం నుండి స్పందన రాలేదన్నారు. చివరికి చేస్తామని ఒప్పుకున్నా ఇంతవరకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా నిలబడాలని ప్రాణాలు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి రూ.5 లక్షలు అందజేశామని తెలిపారు.
KTR Sensational Comments | రైతు డిక్లరేషన్ ఎక్కడ
ఎన్నికల ముందు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్ గురించి ఇచ్చిన హామీలు ఏమాయ్యాని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ రైతులను పట్టించుకోవడం లేదన్నారు. ఓ వైపు వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా.. సీఎం రేవంత్రెడ్డి తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నీళ్లు అడిగితే రక్తం చల్లాలని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రక్తం తీసుకొని అయినా పంటలకు నీళ్లు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రిని, దగాకోరు కాంగ్రెస్ను ఉరికించి కొడితే గానీ రైతు ప్రభుత్వం రాదన్నారు. రైతుల ముఖంపై మళ్లీ చిరునవ్వు చూడాలన్నా.. వారి కళ్లల్లో ఆనందం చూడాలన్నా కేసీఆర్ తిరిగి రావాలన్నారు.
KTR Sensational Comments | దగుల్బాజీ జాతి మాది కాదు
ఇటీవల సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ జాతి ఏందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా కేటీఆర్ స్పందించారు. ‘‘పోరంబోకు, లుచ్ఛా, నికృష్ట, దగుల్బాజీ జాతి నీది రేవంత్ రెడ్డి”అన్నారు. ఉద్యమకారుల మీదకి తుపాకీ తీసుకుపోయిన పోరంబోకు జాతి తమది కాదన్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో రూ.50 లక్షలకు ఒక నాయకుడిని కొనాలని చూసిన దొరికిపోయిన జాతి తమది కాదని ఎద్దేవా చేశారు. ‘నీళ్ళు అడిగితే రక్తం చల్లుకోమన్న రాక్షస జాతి మాది కాదు’ అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: TPCC Chief | పదేళ్ల బీఆర్ఎస్ అరాచక పాలనను ప్రజలు మరిచిపోలేదు : టీపీసీసీ చీఫ్