అక్షరటుడే వెబ్డెస్క్: Revanth Reddy Comments | తెలంగాణ ( Telangana )ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో రెండు రోజుల పర్యటన అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిపై సమీక్షలు జరపడంతో పాటు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శల దాడి చేశారు. పర్యటన ముగింపు సందర్భంగా కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన నిరసన సభలో సీఎం రేవంత్ జాతీయ రాజకీయాలపై కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేశారు.
Revanth Reddy Comments | ప్రభుత్వం పూర్తి మద్దతు..
ఢిల్లీలో విద్యార్థుల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసులు ప్రవర్తించిన తీరును సీఎం తీవ్రంగా ఖండించారు. “అంబేద్కర్ రాజ్యాంగం పౌరులకు ప్రశాంతంగా నిరసన తెలిపే హక్కును కల్పించింది. దాన్ని అణిచివేయాలని చూడడం ప్రజాస్వామ్యాన్ని పూడ్చిపెట్టడమే” అని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణ వైఫల్యాలపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటర్మీడియట్ ఫలితాల గందరగోళాన్ని గుర్తు చేస్తూ, విద్యార్థుల జీవితాలతో ఆడుకునే ఏ ప్రభుత్వానికైనా ఓటమి తప్పదని హెచ్చరించారు.
Revanth Reddy Comments | అభివృద్ధికి పెద్దపీట..
కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, నియోజకవర్గ అభివృద్ధికే సీఎం తొలి ప్రాధాన్యతనిచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశాలు నిర్వహించి పెండింగ్ ప్రాజెక్టులు, తాగునీరు, రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. నిరసన సభ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు. సీఎం పర్యటనతో స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండగా, కొడంగల్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇది కూడా చదవండి: Lohia Corp IPO | ఐపీవోకు లోహియా కార్ప్.. రేపటినుంచే అందుబాటులోకి..