అక్షరటుడే, వెబ్డెస్క్: Fee Reimbursement Dues | రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బీజేపీ ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. బీజేవైఎం ఆధ్వర్యంలో ఫీజు బకాయి.. బీజేపీ లడాయి కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆవిష్కరించారు.
బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana)లో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. కానీ నేటి వరకు ఉద్యోగాలు లేవని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల న్యాయమైన హక్కు కోసం భారతీయ జనతా యువమోర్చా ఈ అంశాన్ని ఉద్యమంగా చేపట్టిందని తెలిపారు.
Fee Reimbursement Dues | బకాయిలు విడుదల చేసే వరకు..
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం పూర్తిగా విడుదల చేసే వరకు ఈ పోరాటం నిరంతరంగా కొనసాగుతుందని రాంచందర్రావు తెలిపారు. ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదు… విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీజేపీ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. ఈ ఉద్యమాన్ని భారతీయ జనతా యువమోర్చా, మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్తారని తెలిపారు. విద్యార్థులందరూ శాంతియుతంగా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Mutyam Venkataramana Remand | రూ.300 కోట్ల అక్రమాస్తులు.. డీఈ వెంకటరమణకు రిమాండ్