అక్షరటుడే, కామారెడ్డి: Visible Policing Kamareddy | విజిబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్ ద్వారా శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) అధికారులను ఆదేశించారు. జిల్లాలో (Kamareddy) వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ఆయన తాడ్వాయి పోలీస్ స్టేషన్ను సందర్శించి సిబ్బంది పనితీరును సమీక్షించారు.
Visible Policing Kamareddy | స్టేషన్లో పరిశీలన
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం యూనిఫాం టర్నౌట్ను పరిశీలించి స్టేషన్ రిసెప్షన్, లాకప్, బ్యారెక్స్, టెక్నికల్ రూమ్, రికార్డులు, కేసుల దర్యాప్తు, సీజ్ వాహనాలు, క్రైమ్ హాట్స్పాట్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసులు, కోర్టు కేసుల పురోగతిపై ఆరా తీసి పలు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదగా వ్యవహరించి సమస్యను పూర్తిగా విని తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో పోలీసులపై విశ్వాసం, భరోసా పెరిగేలా పనిచేయాలని సూచించారు. పాత నేరస్తులు, అనుమానితుల కదలికలపై నిఘా ఉంచి ముందస్తు నేర నివారణ చర్యలు చేపట్టాలని, ప్రతి పిటిషన్ను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసి సీసీఎన్టీఎస్ వ్యవస్థను సమర్థంగా వినియోగించాలని తెలిపారు.
Visible Policing Kamareddy | మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ
మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రధాన రహదారులపై ప్రమాద హాట్స్పాట్లను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డ్రంకన్ డ్రైవ్, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రాబోయే గణేష్ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ, మండపాల వద్ద భద్రత, కమిటీలతో సమన్వయంతో కూడిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ముందుగానే రూపొందించి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సై నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మేడ్చల్లోని టెక్ మహీంద్రా కంపెనీ ముందు ఉద్యోగిని ధర్నా..