అక్షరటుడే వెబ్డెస్క్: Khammam Student Death | ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వైద్యం వికటించడంతో ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్వాపురానికి చెందిన చల్లా రమేష్–మౌనిక దంపతుల కుమార్తె హేమశ్రీ (14) స్థానిక కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 8వ తరగతి చదువుతోంది.
Khammam Student Death | స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు ..
ఆదివారం జలుబు, జ్వరంతో అస్వస్థతకు గురైన బాలికను తల్లిదండ్రులు స్థానికంగా ప్రాక్టీస్ చేస్తున్న ఆర్ఎంపీ వైద్యుడు సంపత్ వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆర్ఎంపీ వైద్యుడు సంపత్ మద్యం సేవించి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. వైద్యుడు బాలిక చేతికి క్యాన్లా ఏర్పాటు చేసి ఇంజెక్షన్ ఇవ్వగానే, ఆమెకు ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆటోలో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు, అప్పటికే హేమశ్రీ మృతి చెందినట్లు ఈసీజీ ద్వారా నిర్ధారించారు.
Khammam Student Death | పోలీసుల అదుపులో ..
బాలిక మృతి చెందిన అనంతరం ఖమ్మంలో పోలీసులు ఆర్ఎంపీ వైద్యుడు సంపత్ను బ్రీత్ అనలైజర్తో పరీక్షించగా, అతను మద్యం సేవించినట్లు తేలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి ఆకస్మిక మృతితో బస్వాపురంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. తన కుమార్తె మృతికి ఆర్ఎంపీ వైద్యుడు సంపత్ నిర్లక్ష్యమే కారణమని మృతురాలి తండ్రి చల్లా రమేష్ సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఎస్ఐ సూరజ్ వెల్లడించారు.
వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి
వైద్యుడు మద్యం సేవించి ఉన్నాడని కుటుంబ సభ్యుల ఆరోపణ.. పరారీలో వైద్యుడు
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో విషాద ఘటన
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని జలుబు, జ్వరంతో అస్వస్థతకు గురికావటంతో… pic.twitter.com/ClhdtqYfR8
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2026
ఇది కూడా చదవండి: Sriramsagar Water Storage | ఎస్సారెస్పీకి తగ్గుతున్న వరద.. 42.116 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ