Madhavanagar ROB | అమ్మో ఆర్వోబీ.. మాధవనగర్​ వద్ద నరకప్రాయంగా ప్రయాణం

నగర శివారులోని మాధవనగర్​ వద్ద ఆర్వోబీ పనులు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Madhavanagar ROB | నగర శివారులోని మాధవనగర్​ వద్ద ఆర్వోబీ పనులు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2023లో ప్రారంభమైన వంతెన పనులు రెండేళ్లలో పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటికీ సగం కూడా కాలేదు.

Madhavanagar ROB | 2023లో ప్రారంభం..

నిజామాబాద్​–హైదరాబాద్​, ఇతర జిల్లాలకు వెళ్లేందుకు మాధవనగర్ రైల్వే గేట్​ వద్ద 2023లో ఆర్వోబీ పనులు ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభించిన కొత్తలో వేగంగా జరిగిన పనులు ప్రస్తుతం పూర్తిగా మందగించాయి. నిర్మాణంలో భాగంగా రైల్వేగేట్​కు ఇరువైపులా భారీ పిల్లర్లు,వాటి అనుసంధాన ప్రక్రియ జరుగుతోంది. పిల్లర్ల పైన దిమ్మెలు అమర్చినప్పటికీ ఇంకా చాలా పనులు పెండింగ్​లో ఉన్నాయి.

Madhavanagar ROB | రూ.93.12కోట్లతో ..

ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.93.12కోట్లుగా నిర్ణయించారు. అయితే కేంద్ర ప్రభుత్వం (Central Government) తమ వాటగా రూ. 30.05కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ63.07కోట్లు ఇవ్వాల్సి ఉంది. అలాగే ఆర్వోబీ నిర్మాణాన్ని సైతం రెండేళ్లలో పూర్తిచేయాలని కాంట్రాక్టర్​కు షరతులు విధించినప్పటికీ నిధుల విడుదలలో జాప్యం కారణంగా పనులు నత్తకు నడక నేర్పేలా సాగుతున్నాయి. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్​, ఇతర ప్రధాన నగరాలకు వెళ్లేందుకు మాధవనగర్​ రహదారి ప్రధానమైంది. నిత్యం వేలసంఖ్యలో వాహనాలు ఈ దారిలో రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే రైల్వేగేట్​ కారణంగా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్​లో చిక్కుకుంటున్నాయి. ఎన్నోసార్లు హైదరాబాద్​కు అత్యవసర స్థితిలో వెళ్లాల్సిన అంబులెన్స్​లు ఈ రైల్వేగేట్​ ట్రాఫిక్​లో చిక్కుకుపోయాయి. దీంతో ఈ ప్రాంతంలో రైల్వే ఓవర్​బ్రిడ్జి కట్టాలని నిర్ణయించారు. అయితే పనులు సాగకపోవడం, రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Madhavanagar ROB | రాష్ట్ర ప్రభుత్వం కారణంగానే..

ఈ ఆర్వోబీపై అనేకసార్లు ఎంపీ అర్వింద్​ మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఇవ్వాల్సిన వాట రూ.30కోట్లకు పైగా ఎప్పుడో ఇచ్చేశామని.. కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఆర్వోబీకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. బీఆర్​ఎస్​ హయంలో ప్రారంభమైన ఈ నిర్మాణం.. కాంగ్రెస్​ సర్కారు హయాంలోనూ నిర్లక్ష్యానికి గురువుతోందని ఆయన విమర్శించారు.

Madhavanagar ROB | వర్షాకాలంలో ప్రయాణం..నరకం..

రైల్వేగేట్​ వద్ద ఇరువైపులా అప్రోచ్​ రోడ్లపై కాంట్రాక్టర్​ పూర్తి నిర్లక్ష్యాన్ని వహిస్తున్నాడని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండువైపులా రోడ్లపై భారీ గుంతలు ఏర్పడడంతో ఆరకిలోమీటర్​ కూడా ఉండని ఈ రహదారిపై ప్రయాణించాలంటేనే భయపడాల్సి వస్తోందని వారంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళ్లలో ఈ మార్గంలో రావాలంటేనే జంకుతున్నారు. గుంతల మయమైన ఆ రోడ్డు నుండి కిందామీద పడి రైల్వే గేటు వద్దకు వచ్చేసరికి లెక్కలేనన్నిసార్లు గేటు పడుతుందని, అక్కడ తమ సమయం అంతా హరించుకుపోతుందని ప్రజలు వాపోతున్నారు. వెంటనే అప్రోచ్​ రోడ్లను బాగు చేయించి.. ఆర్వోబీని పూర్తి చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

Madhavanagar ROB | ఇటీవల నిధుల విడుదల..

ప్రభుత్వ సలహదారు సుదర్శన్​ రెడ్డి ఇటీవల కలెక్టరేట్​లో ఆర్వోబీపై సమీక్ష నిర్వహించారు. నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్​ నిర్లక్ష్యం చేస్తున్నాడనే సమాచారం తెలుసుకున్న ఆయన యుద్ధప్రాతిపదికన రూ.3.15కోట్ల నిధులు విడుదల చేయించారు. ఆర్వోబీ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, బ్లాక్​ లిస్ట్​లో పెడతామని ఆయన కాంట్రాక్టర్​ను హెచ్చరించారు. రెండేళ్ల కాలవ్యవధిలో పూర్తికావాల్సిన ఆర్వోబీ నాలుగేళ్లయినా పూర్తికాకపోవడంతో నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Mandal Congress Committees | నెలాఖరులోగా మండల కాంగ్రెస్​ కమిటీల నియామకం: పీసీసీ చీఫ్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment
  • కాంట్రాక్టు ku బుద్ధిలేదు
    జబ్బలు charuchukune నాయకులకు ఏం లేదు
    Inkennaaalllu ra మాkee tippalu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *