అక్షరటుడే, బోధన్: Riyadh Jail Release | పొట్ట కూటి కోసం సౌదీ అరేబియాకు వలస వెళ్లిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదం కేసులో రెండేళ్లుగా రియాద్ జైలులో ఉన్నాడు. భర్తను ఎలాగైనా జైలు నుంచి బయటకు తీసుకుని రావాలని దివ్యాంగురాలైన భార్య చంటి బిడ్డను వెంటబెట్టుకుని గడపగడపకు తిరుగుతోంది. మరోవైపు వృద్ధ తల్లిదండ్రులు సైతం తమ కొడుకు ఎప్పుడు వస్తాడా అంటూ వేయకళ్లతో ఎదురుచూస్తున్నారు.
Riyadh Jail Release | సాలూర మండలం..
బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలం కుమ్మన్పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రామయ్య, రాజమణి కుమారుడు శ్రావణ్కుమార్ (22)కు చింంతల్పేట్కు చెందిన దివ్యాంగురాలు మమతతో వివాహమైంది. అనంతరం కుటుంబ పోషణ నిమిత్తం సౌదీ అరేబియాలోని రియాద్కు వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ కంపెనీలో అంబులెన్స్ డ్రైవర్గా ఉద్యోగంలో చేరాడు.
Riyadh Jail Release | 2024లో ప్రమాదం..
అయితే 2024 మే 6న శ్రావణ్ నడుపుతున్న అంబులెన్స్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో స్థానికులైన భార్యాభర్తలు మృతి చెందారు. వారి ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడి పోలీసులు శ్రావణ్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో సౌదీ అరేబియా కోర్టు శ్రావణ్ను సాక్ష్యాధారాలతో నేరస్తుడిగా నిర్ధారించింది. బాధిత కుటుంబానికి 3.30 లక్షల సౌదీ రియాద్లను ‘బ్లడ్ మనీ’గా ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఇది భారత కరెన్సీలో రూ.84లక్షలు. అంత మొత్తం చెల్లిస్తేనే శ్రావణ్ అక్కడి జైలు నుంచి విడుదలయ్యే అవకాశలున్నాయి.
Riyadh Jail Release | ఆర్థిక స్థోమత లేక దిక్కుతోచని స్థితిలో..
అయితే అంత ఆర్థిక స్థోమత లేని శ్రావణ్ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న శ్రావణ్ జైలులో ఉండడం.. వృద్ధు తల్లిదండ్రులను కూలీకి వెళ్లేలా చేసింది. మరోవైపు దివ్యాంగురాలైన భార్య మమత చంటిబిడ్డతో తన భర్తను విడిపించాలని ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)తో పాటు నిజామాబాద్, జగిత్యాల జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఆమె వినతిపత్రాలు అందజేసింది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ప్రవాసీ ప్రజావాణిలోనూ తన భర్త పరిస్థితిని వివరించింది.
Riyadh Jail Release | ప్రజాప్రతినిధులు, మానవతావాదులు స్పందించాలి..
ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. తమ కుటుంబానికి రూ.84లక్షలు కట్టే స్థోమత లేదని కన్నీళ్ల పర్యంతమైంది. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, మానవతావాదులు స్పందించి తన భర్తను స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటోంది. రెక్కల కష్టంపై బతికే నిరుపేద కుటుంబం తమదని.. ఇంత భారీ మొత్తాన్ని ఎక్కడినుంచి తేవాలో తెలియట్లేదని వాపోయింది.
ఇది కూడా చదవండి..: Environmental Protection | ప్రకృతి అంతరిస్తే మానవాళికి ప్రమాదమే..: పీసీసీ చీఫ్