అక్షరటుడే, కామారెడ్డి: AI Training Journalists | జర్నలిస్టులకు త్వరలో ఏఐ టెక్నాలజీపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని టీయూడబ్ల్యూజే (ఐజేయూ (TUwjIJU)) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ మహాసభకు వెళ్తున్న సందర్భంగా మార్గమధ్యంలో కామారెడ్డిలో (Kamareddy) కాసేపు ఆగారు.
AI Training Journalists | మారుతున్న కాలానికి అనుగుణంగా..
ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే జిల్లాలో జర్నలిస్టులకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీపై సమగ్ర శిక్షణ ఇస్తామని తెలిపారు.
ఈ టెక్నాలజీ ద్వారా వార్తల సేకరణ, ఎడిటింగ్ మరియు వేగవంతంగా వార్తలను ప్రజలకు అందించడంలో జర్నలిస్టుల నైపుణ్యాలను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు వారి వృత్తి నైపుణ్యాలను పెంపొందించడమే టీయూడబ్ల్యూజే ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్, కార్యదర్శి రాజేష్, కోశాధికారి వెంకటేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు అబిద్, శ్రీకాంత్, శివ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: కరెంట్ కోతలపై రోడ్డెక్కిన అన్నదాతలు