అక్షరటుడే వెబ్డెస్క్: Harish Rao Comments | ప్రభుత్వం చేపట్టిన 22ఏ (నిషేధిత ఆస్తుల జాబితా) అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శుక్రవారం 22ఏ బాధితులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ భారతి పేరుతో రాష్ట్రంలో భూ హారతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy )కేవలం భూములు కాజేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని, ఏకంగా 30 వేల ఎకరాల పాలిటెక్నిక్ భూములపై కన్నేశారని ఆరోపించారు.
Harish Rao Comments | హైడ్రా పేరుతో కూల్చివేత..
భూ సమస్యలపై ఫోన్ చేస్తే పరిష్కరిస్తామని సీఎం చెబుతున్నారని, కానీ ఫోన్ చేయడం దేనికో.. నేరుగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసినా ఎలాంటి పరిష్కారం దొరకలేదని హరీష్ రావు విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చుతున్న ప్రభుత్వానికి బడా బాబుల అక్రమ కట్టడాలు కనిపించడం లేదా అని నిలదీశారు. మంత్రి పొంగులేటికి ఏమాత్రం నైతిక బాధ్యత ఉన్నా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నిషేధిత 22ఏ జాబితా నుంచి సీఎం ఇంటిని తొలగించుకున్నప్పుడు.. సామాన్యుల ఇళ్లను ఎందుకు ఆ జాబితా నుంచి తొలగించడం లేదని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను తక్షణమే 22ఏ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం ఆగదని హరీష్ రావు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Modi Putin Meeting | చర్చలతోనే ఘర్షణలకు పరిష్కారం.. పుతిన్తో ప్రధాని మోదీ భేటీ