అక్షరటుడే వెబ్డెస్క్:Konda Surekha Comments| ప్రధాని మోదీ పర్యటనలు, బీజేపీ రాజకీయాలపై మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలకు కేవలం సభలు పెట్టడం, ‘జై శ్రీరామ్’ అని నినదించడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై పట్టింపు లేదని ఆమె విమర్శించారు. “జై శ్రీరామ్ అంటే పైనుంచి నిధులు వస్తాయా? పథకాలు అందుతాయా?” అని ఆమె ప్రశ్నించారు
Konda Surekha Comments | నిధుల గురించి మాట్లాడడం లేదు..
తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఒక్కరు కూడా మాట్లాడడం లేదని సురేఖ ధ్వజమెత్తారు. ప్రధానిని తీసుకువచ్చి హిందీలో మాట్లాడించి పంపడంపై ఉన్న శ్రద్ధ, రాష్ట్రానికి రావాల్సిన వాటాను రప్పించడంలో లేదని ఆరోపించారు. గతంలో గోదావరి పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్కు కోట్లాది రూపాయలు ఇచ్చిన కేంద్రం, తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి కూడా విదిల్చలేదని ఆమె గుర్తుచేశారు.
Konda Surekha Comments | పుష్కరాల కోసం రూ. 4,200 కోట్లు ..
కేంద్రం సహకరించకపోయినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్యాత్మిక రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. పుష్కరాల కోసం సీఎం రూ. 4,200 కోట్లు కేటాయించి, ఇప్పటికే రూ. 1,400 కోట్లు విడుదల చేశారని చెప్పారు. భద్రాచలం, వేములవాడ, బాసర వంటి పుణ్యక్షేత్రాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని వివరించారు.
Konda Surekha Comments | రైతులను పట్టించుకోని బీఆర్ఎస్..
రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందని కొండా సురేఖ మండిపడ్డారు. పదేళ్ల పాలనలో రైతులను పట్టించుకోని బీఆర్ఎస్, ఇప్పుడు తమను ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు గతంలో బీఆర్ఎస్ మద్దతు పలికిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్యం, విద్య, సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ నిరంతరం కృషి చేస్తోందని ఆమె స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: West Bengal Politics| బెంగాల్లో కమల వికాసం.. మే 9న నూతన ప్రభుత్వ అడుగులు!

