అక్షరటుడే వెబ్డెస్క్: Sand Smuggling | ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ముఠాను వైరా పోలీసులు పట్టుకున్నారు. నిరంతరం వాహనాల నంబర్ ప్లేట్లు మారుస్తూ పోలీసుల కళ్లు గప్పుతున్న వారిని గుర్తించి, లారీలతో పాటు ఎస్కార్ట్గా ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు.
Sand Smuggling | గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ రోడ్డు వద్ద ..
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ఇసుక రీచ్ నుంచి హైదరాబాద్ (వైపు ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై అప్రమత్తమైన వైరా ఎస్సై పుష్పాల రామారావు ఆధ్వర్యంలోని బృందం, గురువారం రాత్రి సోమవారం గ్రామ సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమతులు లేని మూడు ఇసుక లారీలను, వాటికి ఎస్కార్ట్గా వస్తున్న ఒక స్విఫ్ట్ డిజైర్ కారును పోలీసులు గుర్తించి సీజ్ చేశారు.
Sand Smuggling | నెంబర్ ప్లేట్ల మార్పిడి..
నిందితులు పోలీసు తనిఖీల నుంచి తప్పించుకోవడానికి పక్కా ప్లాన్ వేశారు. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను ఎప్పటికప్పుడు మార్చడానికి వీలుగా వీరి దగ్గర భారీగా రేడియం స్టిక్కర్లను సిద్ధంగా ఉంచుకున్నారు. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాలో పాల్గొన్న నల్గొండ జిల్లాకు చెందిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఇస్లావత్ భిక్షు, ముక్కుమాల యాదయ్య, దామ సైదులు, వాంకుడోత్ లింగా నాయక్ అనే నలుగురిని అరెస్టు చేసి మధిర కోర్టులో రిమాండ్కు తరలించారు. మరొక నిందితుడు బచ్చబోయిన యాదయ్య పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Sand Smuggling | కఠిన చర్యలు తప్పవు..
అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై పుష్పాల రామారావు హెచ్చరించారు. ఏపీ నుంచి వచ్చే ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామని, అక్రమాలపై సమాచారం ఇచ్చేవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో ఎస్సై పవన్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Pakistan Bus Accident | లోయలో పడిన బస్సు: 40 మంది మృతి