అక్షరటుడే వెబ్డెస్క్:Telangana Sewerage Projects|తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం , మురుగునీటి నిర్వహణ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 101 పురపాలక సంఘాల్లో (ULBs) భారీ సీవరేజ్ ప్రాజెక్టులను చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏకంగా రూ. 3705.75 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 (SBM 2.0) మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు.
Telangana Sewerage Projects|హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM)..
ఈ భారీ ప్రాజెక్టులను అత్యంత పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ‘హైబ్రిడ్ యాన్యుటీ మోడల్’ (HAM) పద్ధతిని ఎంచుకుంది. పనుల వేగవంతం కోసం 101 పట్టణాలను మూడు ప్రత్యేక ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. దీనివల్ల జాతీయ స్థాయిలోని పెద్ద కంపెనీలు పోటీ పడే అవకాశం కలుగుతుంది. సాధారణంగా భూసేకరణ పూర్తయ్యాకే టెండర్లు పిలిచే నిబంధన ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టు అత్యవసర దృష్ట్యా భూసేకరణ పెండింగ్లో ఉన్నా టెండర్ ప్రక్రియను కొనసాగించాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
Telangana Sewerage Projects|ఐదేళ్ల నిర్వహణ బాధ్యత..
ఈ ప్రాజెక్టులో భాగంగా కేవలం డ్రైనేజీ నెట్వర్క్ , మురుగునీటి శుద్ధి ప్లాంట్ల (STP) నిర్మాణం మాత్రమే కాకుండా, వాటి పర్యవేక్షణపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పనులు దక్కించుకున్న సంస్థలే నిర్మాణానంతరం ఐదేళ్ల పాటు వాటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (O&M) బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇందుకోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను స్పష్టం చేసింది.
Telangana Sewerage Projects|ఆర్థిక ప్రణాళిక..
మొదట ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ. 3,769.34 కోట్లుగా లెక్కించగా, ప్రభుత్వం దాన్ని క్షుణ్ణంగా సమీక్షించి రూ. 3,705.75 కోట్లకు సవరించింది. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర (SBM 2.0) , రాష్ట్ర ప్రభుత్వ వాటాలతో కూడిన పక్కా ఆర్థిక ప్రణాళికను ఖరారు చేశారు. అలాగే, టెండర్లలో ఎక్కువ మంది బిడ్డర్లు పాల్గొనేలా ప్రోత్సహించడానికి ముందస్తుగా ‘ప్రీ-బిడ్’ సమావేశాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే పట్టణాల్లో పారిశుధ్య ప్రమాణాలు పెరగడమే కాకుండా భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉంటాయి.
ఇది కూడా చదవండి: Kavitha Comments KCR|కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మరమనిషిలా మారారు : కవిత


