అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Department of Education | చక్కటి విద్యాబుద్ధులు నేర్పించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్ధవంతంగా నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal), కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టరేట్లో నిర్వహించారు. కార్యక్రమానికి వారితో పాటు రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ హాజరయ్యారు.
Department of Education | సమాజంలో గురువులకు ఎంతో గౌరవం..
ముందుగా డీఈవో అశోక్(DEO Ashok) జిల్లాలో విద్యాశాఖ ప్రగతిని నివేదిక రూపంలో చదివి వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ.. సమాజంలో గురువులకు ఎంతో గౌరవం, గొప్ప స్థానం ఉందన్నారు. 2047 వరకు భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దాలనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని సాకారం చేసేవిధంగా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు. ఏ లక్ష్య సాధనకైనా చదువు ఎంతో తోడ్పాటును అందిస్తుందని, విద్యతో కూడి ఉన్న జీవితం ఉన్నతంగా ఉంటుందన్నారు. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్న ఫలితంగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు నమోదు చేస్తున్నాయని పేర్కొన్నారు.
Department of Education | నిజామాబాద్ జిల్లాలో.
నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ బడుల విద్యార్థులు సాధించిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. అయితే విద్యార్థులు కేవలం మార్కుల సాధనకే పరిమితం కాకుండా, నాణ్యమైన విద్యను ఆర్జించాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో మెలుగుతూ, నైతిక విలువలను పెంపొందించుకోవాలని, తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వాదం ఉన్నప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతామని పేర్కొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్ధి దశ ఎంతో కీలకమన్నారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, కలలను సాకారం చేసుకునే దిశగా నిజాయితీతో ముందుకు వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు.
Department of Education | సీఎం వద్దే విద్యాశాఖ..
రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ మాట్లాడుతూ.. విద్యారంగ ప్రాధాన్యతను గుర్తించిన సీఎం రేవంత్రెడ్డి(CM Revanth reddy) విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతి సదుపాయాలను కల్పిస్తూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్(Young India Integrated Residential Schools), తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను నెలకొల్పుతోందన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా భావిస్తూ వారికి నాణ్యమైన విద్యను బోధించాలని, వారి భవిష్యత్తుకు చక్కటి బాటలు వేయాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధిక మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు, బహుమతులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహూకరించారు. బాల సాహిత్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను అతిథులు తిలకించారు. కార్యక్రమంలో బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు నర్సయ్య, కృష్ణవేణి, జిల్లా పౌర సంబంధాల అధికారిణి ఎన్.పద్మశ్రీ, డీసీఈబీ సెక్రెటరీ సీతయ్య, జీఈసీవో భాగ్యలక్ష్మి, ఎంఈవోలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Bandi Bhagirath case | బండి భగీరథ్ కేసు.. సోషల్ మీడియా పోస్టులపై కేసు నమోదు


