అక్షరటుడే వెబ్డెస్క్: Allahabad High Court Delay | దేశంలోని న్యాయస్థానాల్లో సుదీర్ఘకాలంగా కేసులు పెండింగ్లో ఉండిపోవడంపై సుప్రీంకోర్టు ( Supreme Court ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కింది కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ ఒక హత్య కేసు నిందితుడు దాఖలు చేసిన అప్పీల్ను విచారించడానికి అలహాబాద్ హైకోర్టు ఏకంగా 40 ఏళ్ల సమయం తీసుకోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తిని, ఆశ్చర్యాని వ్యక్తంచేసింది. ఇంతటి అసాధారణ ఆలస్యాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. అసలు కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు ఎలాంటి వినూత్న చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Allahabad High Court Delay | అసలు ఏంటా కేసు?
ఉత్తరప్రదేశ్కు చెందిన విజయ్ సింగ్ అనే వ్యక్తి తన సోదరుడిని హత్య చేసినట్లు వచ్చిన ఆరోపణలపై 1983 నవంబర్లో అరెస్టయ్యాడు. అప్పట్లో అతడి వయసు కేవలం 28 ఏళ్లు. ఈ కేసును విచారించిన కాన్పూర్ సెషన్స్ కోర్టు 1985లో విజయ్ను దోషిగా తేల్చుతూ యావజ్జీవ కారాగార శిక్ష (లైఫ్ ఇంప్రెజన్మెంట్) విధించింది. అయితే, సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ విజయ్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. చిత్రం ఏమిటంటే, ఆ అప్పీల్ పిటిషన్ దాదాపు 41 సంవత్సరాల పాటు హైకోర్టులో పెండింగ్లోనే ఉండిపోయింది. ఎట్టకేలకు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో హైకోర్టు ఆ అప్పీల్ను కొట్టివేసింది. దీంతో బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం ఈ కేసుపై అక్కడ విచారణ జరుగుతోంది.
Allahabad High Court Delay | 43 ఏళ్లలో 3 నెలలే జైల్లో..
ఈ కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తించింది. ఈ 43 ఏళ్ల సుదీర్ఘ కాలంలో నిందితుడు విజయ్ కేవలం మూడు నెలలు మాత్రమే కస్టడీలో ఉన్నాడని, తన అప్పీల్ ఫలితం కోసం ఎదురుచూస్తూ ఇన్నాళ్లూ బెయిల్పై బయటే తిరిగాడని కోర్టు పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. అప్పటివరకు అతడి బెయిల్ను కొనసాగించాలని నిర్ణయించింది. అలహాబాద్ హైకోర్టులో తరచూ ఇలాంటి దీర్ఘకాలిక జాప్యాలు జరగడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. హైకోర్టుల్లో విపరీతంగా కేసులు పేరుకుపోతుండటంతో, విచారణలు త్వరితగతిన సాగేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తోందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇది కూడా చదవండి: Mohan Naik ACB Raid | ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. 100 కోట్ల పైచిలుకు ఆస్తులు?
