అక్షరటుడే వెబ్డెస్క్: Bandi Sanjay Land Claims | సిద్దిపేట ( Siddipet )భూముల వివాదంపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం మరియు ఆ పార్టీ నేతల భూకబ్జాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కబ్జాలకు సంబంధించి పక్కా ఆధారాలుంటే వెంటనే ఆ భూములను స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకునే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు.
Bandi Sanjay Land Claims | దృష్టి మళ్లించేందుకే డ్రామాలు..
ప్రభుత్వం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్తో లోపాయికారీ డీల్ కుదుర్చుకోవడానికే అసెంబ్లీలో ప్రత్యేక దర్యాప్తు కమిషన్ వేశారా అంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు దొందూ దొందేనని విమర్శించారు. పరస్పర విమర్శలతో ప్రజలను డైవర్ట్ చేస్తూ అసలు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని, ప్రజలంతా ఇవన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు.
Bandi Sanjay Land Claims | త్వరలోనే దండయాత్ర..
కేసీఆర్ పుట్టుకతోనే వందల ఎకరాలకు యజమాని కానేకాదని, ఆయన ఎన్నికల అఫిడవిట్లతోనే ఆ విషయం తేలిపోయిందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ రాజకీయ జీవితమంతా అక్రమాలు, అవినీతి, భూదందాలతోనే నిండిపోయిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ల్యాండ్లిటింగ్, భూ దోపిడీపై త్వరలోనే తాము ‘దండయాత్ర’ చేస్తామని బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. కబ్జా చేసిన ఆ భూముల్లో కాషాయ జెండాలు పాతి, వాటిని పేదలకు పంచుతామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని భూదోపిడీలు, అవినీతి బాగోతాలపై సమగ్ర విచారణ జరిపించి తీరుతామని ఆయన తేల్చిచెప్పారు.
ఇది కూడా చదవండి: GST Officer Bribery | రూ.8 లక్షల లంచం తీసుకుంటూ చిక్కిన జీఎస్టీ అధికారి