అక్షరటుడే వెబ్డెస్క్: BJP GHMC Elections | తెలంగాణలో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ నేత రాంచందర్ రావు ( Ramchander Rao )స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ జాతీయ స్థాయిలో ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ, రాష్ట్రంలో పొత్తుల అంశాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారంటీల అమలు తీరుపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
BJP GHMC Elections | వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యం..
బీజేపీలో పాత, కొత్త నాయకులు అనే తేడా ఉండబోదని, త్వరలోనే ఇతర పార్టీల నుంచి చాలా మంది ప్రముఖులు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని రాంచందర్ రావు వెల్లడించారు. ఎన్నికలకు ఇంకా రెండన్నరేళ్ల సమయం ఉండటంతో ఆచితూచి అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో తమకు బలమైన అభ్యర్థులు ఉన్నారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరుతామని, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒడిశా, బెంగాల్ కంటే తెలంగాణలో పార్టీ సంస్థాగతంగా ఎంతో బలంగా ఉందని ఆయన తెలిపారు.
BJP GHMC Elections | డీలిమిటేషన్ బిల్లుపై కీలక వ్యాఖ్యలు..
డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి కొందరు కాంగ్రెస్ నేతలు సైతం మద్దతు తెలిపే అవకాశం ఉందని రాంచందర్ రావు అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుకు త్వరలోనే ఆమోదం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో నేతల మధ్య చిన్నపాటి భేదాభిప్రాయాలు ఉండవచ్చు కానీ, ఎటువంటి తీవ్రమైన విభేదాలు మాత్రం లేవని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Sevadal Appointments | సేవాదళ్ మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత