అక్షరటుడే, వెబ్డెస్క్ : Indiramma Houses | రాష్ట్రంలోని పేదల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు.
రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ఆదిలాబాద్లో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. మే 21న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలపై చర్చిస్తామన్నారు.
రెవెన్యూ, గృహ నిర్మాణ విషయాలపై ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఇన్చార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులతో మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, గత ప్రభుత్వ దూరదృష్టి లోపం కారణంగా హైదరాబాద్ (Hyderabad) నగరానికి దూరంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారని, దాని ఫలితంగా తలెత్తిన సమస్యలు నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు, నియోజకవర్గాలను ప్రామాణికంగా తీసుకుని, ప్రస్తుతం పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిని గుర్తించి, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Indiramma Houses | ఇళ్ల కేటాయింపు కోసం ప్రత్యేక డ్రైవ్
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు కోసం యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. పూర్తయిన ఇళ్లతో పాటు వివిధ నిర్మాణ దశలలో ఉన్న ఇళ్ల లబ్ధిదారులను ఈ నెలాఖరులోగా గుర్తించాలని ఆయన ఆదేశించారు. కాలనీల నుండి 5 నుండి 8 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారిని మాత్రమే ఎంపిక చేయాలని ఆయన స్పష్టం చేశారు.
Indiramma Houses | వసతులు కల్పించాలి
ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో లబ్ధిదారులు నివసించేలా చూడాలన్నారు. ఆ కాలనీలలో తాగునీరు, మురుగునీటి పారుదల, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాల కల్పనను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో గృహ స్థలాలు ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలను పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమించుకుంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి హెచ్చరించారు.
Indiramma Houses | రాజకీయాలకు తావులేదు
మంత్రి శ్రీధర్బాబు (Minister Sridhar Babu) మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. లబ్ధిదారుల ఎంపికకు పేదరికం మాత్రమే అర్హతా ప్రమాణమని, ఈ పథకంలో రాజకీయాలకు ఎటువంటి తావు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎటువంటి వివక్ష చూపడం లేదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు.
ఇది కూడా చదవండి..: Paddy Farmers | ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

