BJP Ticket Scam | ఇందూరు బీజేపీలో కలకలం.. కార్పొరేటర్​ టికెట్​ పేరిట డబ్బులు వసూలు..!

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: BJP Ticket Scam | ఇందూరు బీజేపీలో ఓ ఘటన కలకలం రేపుతోంది. ఇటీవల జరిగిన నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో (Nizamabad Municipal Corporation elections) కొందరు చోటా నాయకులు టికెట్ల పేరిట డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్​ ఇప్పిస్తామంటూ కొందరు నాయకులు డబ్బులు తీసుకుని మోసం చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ విషయమై ఓ మహిళ బీజేపీ జిల్లా అధ్యక్షుడికి ఫిర్యాదు చేయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.

BJP Ticket Scam |అసలేం జరిగిదంటే..

తనకు కార్పొరేటర్​ టికెట్​ ఇప్పిస్తానని బీజేపీ నేత తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని బాధితులు మిర్యాల్కర్​ గీత పార్టీ నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడు దినేష్​​ కులాచారి (Dinesh Kulachari)కి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ప్రకారం.. కార్పొరేటర్​ ఎన్నికల్లో 49వ డివిజన్​ బీజేపీ టికెట్​ ఇప్పిస్తానని బీజేపీ నాయకుడు బూసపు​ శంకర్​ ఓ మహిళను సంప్రదించాడు. అతడి మాటలను నమ్మిన సదరు మహిళ శంకర్​కు రూ. లక్ష ముట్టజెప్పింది. అంతేకాకుండా ప్రచారానికి కారు, ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, నమూనా బ్యాలెట్​కు డబ్బులు కావాలని చెప్పి అదనంగా మరిన్ని డబ్బులు వసూలు చేశాడు. అనంతరం నీకు టికెట్​ కన్​ఫాం అయ్యింది అంటూ సదరు మహిళను నమ్మబలికాడు. ఇలా నామినేషన్​ చివరి రోజు వరకు నమ్మించి కాలం గడిపాడు. చివరకు తనకు టికెట్​ రాలేదని తెలిసి మోసపోయానని గ్రహించింది. అంతేకాకుండా ఇండిపెండెంట్​గా కూడా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయింది.

BJP Ticket Scam | డబ్బులు అడిగితే బెదిరింపులు

టికెట్​ రాకపోవడంతో సదరు మహిళ బీజేపీ (BJP) నాయకుడిని సంప్రదించింది. తనకు టికెట్​ రానందున తన డబ్బులు తనకు వాపస్​ ఇవ్వాలని కోరింది. అయినా స్పందించకపోవడంతో డబ్బుల కోసం నిలదీసింది. దీంతో సదరు నాయకుడు అసలు రూపం బయటపెట్టాడు. ‘ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వను.. ఏం చేసుకుంటావో చేసుకో.. ఈ విషయం ఎవరైనా చెబితే నీ అంతు చూస్తా’ అంటూ అతని తమ్ముడితో కలిసి బెదిరింపులకు దిగాడు. ఎక్కడ కనిపించినా తనను అసభ్యంగా దూషిస్తున్నాడని.. నా అంతుచూస్తానని బెదిరిస్తున్నాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడితో పాటు ఎమ్మెల్యే ధన్​పాల్​కు కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.

BJP Ticket Scam | పార్టీకి చెడ్డపేరు తెస్తున్న చోటా నేతలు

ఇందూరు బీజేపీలోని పెద్ద నాయకులు పార్టీని ప్రజల్లో తీసుకెళ్లేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పార్టీ నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Dharmapuri Arvind)తో పాటు ఎమ్మెల్యేలు పార్టీ అభివృద్ధి కోసం శాయశక్తులా పనిచేస్తున్నారు. పార్టీపై ఎటువంటి మరక పడకుండా ముందుకు సాగుతున్నారు. అలాంటిది కొందరు చోటా నాయకులు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కొందరు కార్పొరేటర్లు డబ్బులు వసూలు చేయడంతో పాటు ఇలా మరికొందరు టికెట్ల పేరిట దండుకోవడం.. పార్టీకి చెడ్డపేరు తెస్తోందని శ్రేణుల్లో చర్చ మొదలైంది.

BJP Ticket Scam | ఎన్నికల సమయంలోనూ..

మున్సిపల్​ ఎన్నికల (Municipal elections) సమయంలోనూ బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ సహాయం చేసినట్లు సమాచారం. పార్టీ ఫండ్​ నుంచి అభ్యర్థుల ఖర్చుల కోసం కొంత మేర డబ్బులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందూలోనూ కొందరు చోటామోటా నాయకులు తమ చేతివాటం ప్రదర్శినట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై కొందరు నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా.. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతం నుంచి గెలిపిన బీజేపీ కార్పొరేటర్​ ఇటీవల ఒకరి నుంచి పెద్దమొత్తం డబ్బులు డిమాండ్​ చేయడం.. ఇదేమిటని అడిగితే పార్టీ టికెట్​ కోసం రూ.లక్షల ఖర్చు చేశామని బహిరంగ వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. అత్యంత క్రమశిక్షణ కలిగిన బీజేపీలో కొందరు చిన్నస్థాయి నాయకులు పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చేలా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి..: Bandi Bhageerath | సాయిభగీరథ్​ను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *