అక్షరటుడే, వెబ్డెస్క్: Chandrababu Convoy | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్లో మరోసారి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంధన పొదుపు చర్యలు, భద్రతా అవసరాల మధ్య సమతుల్యత సాధించేలా అధికారులు కొత్త నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేకంగా రెండు మినీ బస్సులను కాన్వాయ్లో చేర్చారు. ఇటీవల కుప్పం పర్యటన సందర్భంగా ఈ కొత్త వాహనాలు తొలిసారిగా కనిపించాయి. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 12 నుంచి కేవలం 4కు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Chandrababu Convoy | రెండు మినీ బస్సులు..
అయితే ముఖ్యమంత్రికి జడ్ ప్లస్ భద్రత ఉండటంతో ఆయన వెంట ఎన్ఎస్జీ సిబ్బందితో పాటు ఇతర భద్రతా సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. వాహనాల సంఖ్య తగ్గడంతో భద్రతా సిబ్బంది ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు గుర్తించారు. దీంతో కార్ల సంఖ్యను పెంచకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని అధికారులు ఎంపిక చేశారు. భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేకంగా రెండు మినీ బస్సులను ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సులో 13 మంది చొప్పున మొత్తం 26 మంది ప్రయాణించేలా సదుపాయాలు కల్పించారు. అలాగే భద్రతా బృందంతో పాటు మెడికల్ టీమ్ కూడా ఈ బస్సుల్లోనే ప్రయాణించనుంది.
Chandrababu Convoy | భద్రతలో ఎలాంటి లోటు లేకుండా చర్యలు
ఇకపై ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనల సమయంలో ఈ మినీ బస్సులను వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఒకవైపు ఇంధన పొదుపు లక్ష్యం కొనసాగుతుండగా, మరోవైపు ముఖ్యమంత్రి భద్రతలో ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకున్నట్లైంది. ఏపీలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ కాన్వాయ్లలో వాహనాల వినియోగాన్ని తగ్గిస్తూ ఇంధన పొదుపు చర్యలను అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ తాజా మార్పు ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇది కూడా చదవండి..: Deloitte Visakhapatnam | విశాఖకు మరో ఐటీ దిగ్గజం.. డెలాయిట్ ఎంట్రీకి సన్నాహాలు.. ఐటీ హబ్గా దూసుకెళ్తున్న సాగర నగరం


