అక్షరటుడే, వెబ్డెస్క్ : Drinking Water Wastage | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ప్రజలకు తాగునీరు అందించడానికి జలమండలి (HMWS SB) అధికారులు అనేక చర్యలు చేపడుతున్నారు. వందల కిలోమీటర్ల నుంచి జలాలను తరలించి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. అయితే కొందరు తాగునీటిని వృథా చేస్తున్నారు. అలాంటి వారిపై అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు.
నగరంలోని జూబ్లీహిల్స్ (Jubilee Hills) రోడ్ నంబర్ 33లోని ఒక భవనం వద్ద తాగునీటితో ప్రాంగణాన్ని కడుగుతూ నీటిని వృథా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.జలమండలి ఓ అండ్ ఎం డివిజన్–6 అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, వినియోగదారుడికి రూ.5 వేల జరిమానా విధిస్తూ నోటీసు జారీ చేశారు. జరిమానా మొత్తాన్ని నోటీసు అందుకున్న ఏడు రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు.మరోసారి నీటిని వృథా చేస్తే సెక్షన్ 42 ప్రకారం తాగునీరు, మురుగునీటి కనెక్షన్లను నిలిపివేయడంతో పాటు తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Drinking Water Wastage | పొదుపుగా వాడుకోవాలి
తాగునీటిని వాహనాలు, రహదారులు, ప్రాంగణాల శుభ్రతకు వినియోగించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పొదుపుగా వాడాలని జలమండలి అధికారులు కోరారు. ప్రస్తుతం జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోయాయి. భూగర్భ జలాలు సైతం తగ్గడంతో ప్రజలు జలమండలి సరఫరా చేసే నీటిపైనే ఆధార పడుతున్నారు. ఇటీవల ట్యాంకర్లకు సైతం డిమాండ్ బాగా పెరిగింది. కొన్ని కాలనీల్లో ప్రజలకు సరిపడా నీరు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కొందరు తాగునీటిని వృథా చేస్తున్నారు. వాహనాలు కడగడం, ఇళ్లు శుభ్రం చేయడం వంటి పనులు చేస్తున్నారు. అలాంటి వారిపై జలమండలి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
దీనిని కూడా చదవండి : BRS Yuva Sangrama | బీఆర్ఎస్ ‘యువ సంగ్రామ సదస్సు’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్