అక్షరటుడే, ఇందూరు: Electric Bus Safety | ఎలక్ట్రిక్ బస్సుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్ అన్నారు. నిజామాబాద్ రీజియన్ పరిధిలోని (Nizamabad RTC) నిజామాబాద్ బస్స్టేషన్, నిజామాబాద్-2 డిపోను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు.
Electric Bus Safety | భద్రతా చర్యలపై అధికారులతో సమీక్ష
నిజామాబాద్-2 డిపో పరిధిలోని ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఆపరేషన్, ఛార్జింగ్ వ్యవస్థ, భద్రతా చర్యలపై అధికారులతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీక్షించారు. రీజియన్లో మొత్తం 89 ఎలక్ట్రిక్ బస్సులు ఉండగా, ప్రస్తుతం 35 ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే ఆపరేషన్లో ఉన్నట్లు అధికారులు వివరించారు. ఇటీవల కొన్ని ఎలక్ట్రిక్ బస్సుల్లో సాంకేతిక సమస్యలు, ఆకస్మికంగా మంటలు చెలరేగే ఘటనల నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి బస్సును పూర్తిస్థాయిలో సాంకేతికంగా తనిఖీ చేసిన అనంతరమే ప్రయాణికుల సేవలకు వినియోగించాలని, బ్యాటరీ, వైరింగ్, ఛార్జింగ్ వ్యవస్థ, ఉష్ణోగ్రత నియంత్రణ తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
Electric Bus Safety | ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత
ప్రయాణికుల భద్రతే సంస్థకు అత్యంత ముఖ్యమని, డ్రైవర్లు, సాంకేతిక సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని సోలమన్ సూచించారు. అనంతరం నిజామాబాద్ బస్ స్టేషన్లో(Telangana Transport) ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, బస్సుల రాకపోకలు, సమాచార బోర్డులు తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ పి.జ్యోతి, నిజామాబాద్-1 డిపో మేనేజర్, నిజామాబాద్-2 డిపో మేనేజర్, అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన