Grain Procurement Issues | తెలంగాణ గొంతు కోసేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయి: ప్రశాంత్​రెడ్డి

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Grain Procurement Issues | తెలంగాణ గొంతు కోసేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి (MLA Prashanth Reddy) ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మారిన నాటి నుండి రాష్ట్రంలో రాక్షస పాలన మొదలైందని దుయ్యబట్టారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ(Yellareddy Constituency) ఇన్​ఛార్జి, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ (Former MLA Jajala Surender) ఆధ్వర్యంలో శనివారం ఎల్లారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ‘సర్​’పై నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.

Grain Procurement Issues | బీజేపీ, కాంగ్రెస్​ ఒక్కటయ్యాయి..

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలు ఒకటైపోయాయని, నరేంద్ర మోదీ చెప్పినట్లు రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారని వేముల ఆరోపించారు. ‘నాడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల బావుల వద్ద ఉచిత కరెంట్‌ను నియంత్రిస్తూ మీటర్లు పెట్టాలని నరేంద్ర మోదీ ఒత్తిడి తెచ్చారు. మీటర్లు పెడితే ఏడాదికి రూ. 5 వేల కోట్ల చొప్పున, ఆరేళ్లకు రూ. 30వేల కోట్ల నిధులు ఇస్తామని ఆశ చూపారు. కానీ కేసీఆర్ రైతుల ప్రయోజనాల కోసం ఆ రూ.30 వేల కోట్లను సైతం తృణప్రాయంగా వదులుకున్నారన్నారు. కాని కరెంట్ మీటర్లు పెట్టేందుకు ససేమిరా ఒప్పుకోలేదని వేముల అన్నారు. కానీ నేడు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, మోదీ చెప్పిన మీటర్ల నిబంధనకు తలొగ్గి రైతుల పొలాల వద్ద మీటర్లు పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారని మండిపడ్డారు.

Grain Procurement Issues | ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సమావేశంలో..

ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ERC) సమావేశంలో విద్యుత్ శాఖ అధికారి శశాంక్ మాట్లాడుతూ.. ఎంత విద్యుత్ సరఫరా అవుతుందో తెలుసుకోవడానికే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు పెడుతున్నామని చెప్పారని.. కరెంట్ ఉచితంగా ఇచ్చేటప్పుడు నీకు లెక్కలు ఎందుకని.. మొదట ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీటర్లు పెడతారు.. ఆ తర్వాత మెల్లగా మన బావుల కాడికి వచ్చి మీటర్లు పెడతారు. ఇదంతా రైతులపై భారం వేయడానికేనని ఆయన హెచ్చరించారు. రైతుల బావుల వద్ద కరెంట్ మీటర్లు పెట్టాలనే కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల కుట్రలను రైతాంగం అంతా ఏకమై తిప్పికొట్టాలని ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతాంగం తరపున ఈ సమావేశం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

Grain Procurement Issues | మూడు గంటల కరెంట్​తో పొలం పారించి చూపిస్తావా..?

గతంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ‘రైతులకు మూడు గంటల కరెంట్ చాలు’ అని అమెరికాలో మాట్లాడితే, నిన్నటి డిస్కమ్ మీటింగ్​లో కూడా కాంగ్రెస్ కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి కూడా రెగ్యులేటరీ కమిషన్(Regulatory Commission) అలాగే మాట్లాడానని ప్రశాంత్​రెడ్డి అన్నారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలని, చివరి మడి దాకా నీళ్లు పోతాయని, ఇప్పటివరకు వ్యవసాయం అట్లే నడిచిందని చెప్పడం సిగ్గుచేటన్నారు. మూడు గంటల కరెంట్​తో నీ పొలం పారించి చూపిస్తావా రెవంత్ రెడ్డి అని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉచిత కరెంట్​ను ఎగ్గొట్టేందుకే నరేంద్ర మోదీ చెప్పినట్లు రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారని మండిపడ్డారు. జొన్నలు కొనమని రైతులు మొత్తుకుంటే.. నిన్న మొన్న కాంటాలు పెట్టి, ఎకరానికి కేవలం 10 క్వింటాళ్లు మాత్రమే కొంటామని చెప్తున్నారు. ఒక ఎకరానికి 30 క్వింటాళ్ల జొన్నలు పండితే, మీరు కేవలం 10 క్వింటాళ్లే కొంటే మిగతా 20 క్వింటాళ్లు రైతులు ఎక్కడ పోసుకోవాలని ఆయన ప్రశ్నించారు. రైతులను పనికిరాని యాప్​ తీసుకొచ్చి యూరియా కోసం ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తాము యూరియా ఇవ్వాలని కేంద్రాన్ని అడిగామని, కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులెత్తేశారు అని వేముల గుర్తు చేశారు.

Grain Procurement Issues | కష్టపడుతున్న కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది.. మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్

vg

ఎల్లారెడ్డి నియోజక వర్గంలో సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని.. దీంతో పాటు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని ఉమ్మడి జిల్లా సభ్యత్వ ఇన్​ఛార్జి మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్​ అన్నారు. నిరంతరం ప్రజలతో ఉన్నందునే పార్టీకి ప్రజల్లో స్థానం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలంటే బీఆర్ఎస్ సభ్యత్వం 40 వేల నుంచి 80 వేలకు చేరాలని.. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తిగా డిజిటలైజేషన్‌లోనే ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని 274 బూత్​లకు 548 మంది ఇన్​ఛాజీలు ఉన్నారన్నారు.

Grain Procurement Issues | ప్రతి వర్గాన్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం..: మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్.

reddy 3

ఎమ్మెల్యే మదన్ మోహన్​ ఎక్కడ ఉన్నాడని.. ఇక్కడ రైతులు ధాన్యం అమ్ముడుపోక ఇబ్బందులు పడుతుంటే స్విట్జర్లాండ్​లో చల్లగా ఏసీలో కూర్చున్నావా అని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్​ అన్నారు. బీఆర్​ఎస్​ పాలనలో ఒక్క రోజు ఆలస్యం కాకుండా కాంటా కాంగానే వడ్లు రైస్ మిల్లులకు పంపినామని.. అవసరమైతే ఆర్టీసీ కార్గోలో పంపించామన్నారు. కనీసం ఒక్క రైతు ముఖంలో సంతోషం కనిపిస్తలేదని.. కన్నీళ్లే ఉన్నాయన్నారు. ఎల్లారెడ్డి(Yellareddy) ప్రాంతంలో కల్లాలలోని వడ్లు కేవలం 30 శాతం మాత్రమే పోయాయని.. ఇంకా 70 శాతం వడ్లు ఉన్నాయన్నారు. ఇంకో రెండు రోజులైతే వర్షాలు వస్తాయని.. ఇప్పటికే చాలాశాతం వడ్లు వర్షానికి మొలకలు కూడా వచ్చాయన్నారు. 11 నెలల క్రితం లింగంపేటలో బ్రిడ్జి కొట్టుకుపోతే సీఎం వచ్చి చూశాడని.. రూ.కోటి మంజూరుచేస్తున్నట్లు చెప్పారని..మరి ఆ నిధులు ఎటు పోయాయో తేల్చాలన్నారు.

Grain Procurement Issues | బీఆర్​ఎస్​ హయాంలో తండాలకు రోడ్లు..

బీఆర్ఎస్ హయాంలో తండాలకు రూ.35 కోట్లతో రోడ్లు వేశామన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ నీ హయాంలో ఎన్ని నిధులు తీసుకువచ్చావో జీవో కాపీలతో ఎల్లారెడ్డిలోని గాంధీ చౌక్​కు రావాలని..బీఆర్​ఎస్​ హయాంలో ఎన్ని నిధులు తెచ్చామో చర్చకు కూర్చుందామన్నారు. మున్సిపాలిటి ఎన్నికలలో నోట్ల కట్టలు పంచి, మా నాయకులను అరెస్ట్ చేసి గెలిచింది గెలుపు కాదు, నీవు ఎలా గెలిచావో ఎల్లారెడ్డి ప్రజలకు బాగా తెలుసని ఎమ్మెల్యేను ఉద్దేశించి జాజాల మాట్లాడారు. వెల్లుల్లి- గండివేర్ రోడ్డు కోసం అటవీ శాఖ అనుమతి తీసుకువచ్చింది తానని. దానిని కూడా నువ్వే తెచ్చినట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. ఒక్క బోరు వేస్తే అపర భగీరధుడు అంటూ ప్రచారం చేసుకోవడం మీకే చెల్లుబడి అయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, హన్మంత్​ షిండే, మాజీ జెడ్పీ ఛైర్మన్ ద ఫెదర్ రాజు, తానాజీ రావు ప్రతాప్​రెడ్డి, మనోహర్ రెడ్డి, మండలాల నాయకులు పాల్గొన్నారు.

reddy2

ఇది కూడా చదవండి: Women Auto Driver | సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి.. ఆటో డ్రైవర్‌గా మారిన మహిళా టెక్కీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *