అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Metro Phase II | హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-II విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-Iను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కోరారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి వేర్వేరుగా లేఖలు రాశారు.
ఇటీవల జూన్ 23, 24 తేదీలలో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఆ నిర్ణయాల ప్రకారం మెట్రో ఫేజ్-I ఆస్తుల విలువను నిర్ధారించడం (Valuation), అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ (Refinancing) బాధ్యతలతో పాటు, ఫేజ్-II విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఎస్బీఐ క్యాప్స్ (SBI CAPS)ను నియమించాలని ఉమ్మడిగా అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించారు.
Hyderabad Metro Phase II | బాధ్యతలు అప్పగించాలి
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR)ను ఖరారు చేయకపోవడం, ఎస్బీఐ క్యాప్స్కు అధికారికంగా బాధ్యతలు అప్పగించడంలో జాప్యం జరగడంపై సీఎం రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మెట్రో ఫేజ్-I నిర్వహణలో రోజువారీ ఇబ్బందులు, అనిశ్చితి ఎదురవుతున్నాయని, అలాగే ఫేజ్-II డీపీఆర్ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ భవిష్యత్ ప్రజా రవాణా అవసరాలకు అత్యంత కీలకమైన మెట్రో ఫేజ్-II విస్తరణ పనులు ఆలస్యం కాకుండా ఇద్దరు కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఎస్బీఐ క్యాప్స్ నియామక ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి : Paddy Bonus Guidelines | సన్నాలకు బోనస్పై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు.. రైతులకు తిప్పలు