అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad MMTS AC Coaches | హైదరాబాద్ నగరంలో రోజూ ఎంఎంటీఎస్ రైళ్లను ఆశ్రయించే వేలాది మంది ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది. హైదరాబాద్ లోకల్ రైళ్లలో త్వరలో ఏసీ కోచ్లు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా ఎండలు, ఉక్కపోతలో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలను కలుపుతున్న ఎంఎంటీఎస్ రైళ్లకు ఏసీ కోచ్లను జత చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించింది. రైల్వే బోర్డు ఆదేశాల మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇందుకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
Hyderabad MMTS AC Coaches | తొలిదశలో 2 నుంచి 4 ఏసీ కోచ్లు
తొలిదశలో ప్రస్తుతం నడుస్తున్న ఒక్కో ఎంఎంటీఎస్ రైలుకు 2 నుంచి 4 ఏసీ కోచ్లు జత చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అనంతరం పూర్తిగా ఏసీ రైళ్లను నడిపే అంశంపైనా రైల్వే శాఖ దృష్టి సారిస్తోంది.
దేశంలోని ముంబయి, చెన్నై, కోల్కతా వంటి నగరాల్లో ఏసీ లోకల్ రైళ్లకు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో హైదరాబాద్లోనూ ఈ సదుపాయాన్ని తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Hyderabad MMTS AC Coaches | 2027 ఏప్రిల్ నాటికి అందుబాటులోకి?
దేశంలోని వివిధ రైల్వే కోచ్ ఫ్యాక్టరీల్లో లోకల్ రైళ్ల కోసం ఏసీ కోచ్ల తయారీకి రైల్వే బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పెద్ద సంఖ్యలో ఏసీ కోచ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో హైదరాబాద్ ఎంఎంటీఎస్లోనూ ఏసీ కోచ్లను దశలవారీగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Hyderabad MMTS AC Coaches | రోజూ 60 వేల మంది ప్రయాణం
ప్రస్తుతం హైదరాబాద్ నగర పరిధిలో సుమారు 70 ఎంఎంటీఎస్ రైళ్లు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. ఉప్పుగూడ–ఆర్సీపురం, లింగంపల్లి–హైదరాబాద్, కాచిగూడ–మేడ్చల్, ఘట్కేసర్–లింగంపల్లి తదితర మార్గాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. రోజూ సుమారు 60 వేల మంది ప్రయాణికులు ఎంఎంటీఎస్ను వినియోగిస్తున్నట్లు తాజా నివేదిక పేర్కొంది.
ఐటీ ఉద్యోగులకు మరింత ప్రయోజనం
ఎంఎంటీఎస్లో ఏసీ కోచ్లు అందుబాటులోకి వస్తే ముఖ్యంగా ఐటీ కారిడార్లో పనిచేసే ఉద్యోగులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారే అవకాశం ఉంది. రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్కు ప్రత్యామ్నాయంగా ఎంఎంటీఎస్ను మరింత మంది వినియోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Electric Auto Scheme | ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ మార్గదర్శకాలు విడుదల
మొత్తంగా, ఏసీ కోచ్ల ప్రవేశంతో హైదరాబాద్ ఎంఎంటీఎస్ సేవలకు కొత్త ఊపు వస్తుందని ప్రయాణికులు ఆశిస్తున్నారు. అయితే ఏసీ కోచ్ల సంఖ్య, ఛార్జీలు, ఏ మార్గాల్లో తొలుత ప్రవేశపెడతారు..? వంటి వివరాలపై రైల్వే శాఖ నుంచి తుది ప్రకటన రావాల్సి ఉంది.