అక్షరటుడే, కామారెడ్డి: Indiramma house | ‘నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అందరితో పాటు నా పేరు కూడా లిస్టులో వచ్చింది. అయితే ఎంపీవో లాగిన్లో నా అప్లికేషన్లో నా నంబర్ లేదని అధికారులు చెబుతున్నారు. అప్లికేషన్ స్టేటస్ మాత్రం కలెక్టర్ అప్రూవల్ కోసం పెండింగ్ ఉందని చూపిస్తోంది. మాకు ఇల్లు లేదు. మా అమ్మకు ఒకటే కిడ్నీ ఉంది. ఆమె పేషంట్. మాకు ఇల్లు ఇప్పించాలి’ అంటూ ఇందిరమ్మ ఇంటి బాధిత కుటుంబం కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టింది.
Indiramma house | బాధితుల వద్దకు వెళ్లి..
విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ బాధితులకు ఎదురెళ్లి కారులో ఎక్కించుకుని ఎంపీడీవో కార్యాలయానికి తీసుకెళ్లారు. అనంతరం బాధితులకు ఇల్లు మంజూరు పత్రం అందజేసి ఇంటి నిర్మాణానికి అధికారులు ముగ్గు పోశారు. ఈ ఘటన బీబీపీట మండలంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎల్లమైన నందినికి గ్రామంలో 18 మందితో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జాబితాలో పేరు వచ్చింది. అయితే ఇంటి నిర్మాణం చేసుకోవడానికి మంజూరు పత్రం రాలేదు. అధికారులను అడిగితే ఎంపీడీవో లాగిన్లో పేరు లేదని చెప్పారు.
అప్లికేషన్ స్టేటస్ మాత్రం కలెక్టర్ పెండింగ్ ఉన్నట్టుగా కనిపించింది. దాంతో సదరు లబ్ధిదారులు బీబీపేట నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా బయలుదేరారు. జనగామ వద్దకు రాగానే విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ గిరి బాధితుల వద్దకు వెళ్లి వారిని కారులో ఎక్కించుకుని ఎంపీడీవో కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడికక్కడే ఇంటి మంజూరు పత్రం రెడీ చేసి ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేయాలని చెప్పి వెళ్లారని బాధితులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: SI Transfers | కమిషనరేట్లో భారీగా ఎస్సైల బదిలీలు

