అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Induru Ranabheri | బీజేపీ ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమం అట్టర్ప్లాప్ షోగా నిలిచిందని కాంగ్రెస్ నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
Induru Ranabheri | ఉనికి కాపాడుకునేందుకే ఈ ప్లాప్షో..
జిల్లాలో ఎంపీ అర్వింద్ (MP Arvind) నిర్వహించిన ‘రణభేరి’ కార్యక్రమం ఒక అట్టర్ ఫ్లాప్ షోగా నిలిచిందన్నారు. అది విద్యార్థుల కోసం పెట్టిన రణభేరి కాదని.. కేవలం ఆయన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఆడిన డ్రామా అని విమర్శించారు. రణభేరి వేదికగా ఆయన మాట్లాడిన మాటలు, చేసిన ఆరోపణలు పూర్తిగా హాస్యాస్పదమన్నారు. గత ఎన్నికల్లో బాండ్ పేపర్ రాసి ఇచ్చి పసుపు బోర్డు తెస్తానని రైతులను అర్వింద్ మోసం చేశాడన్నారు. ఇప్పటివరకు జిల్లాలో బోర్డు ఏర్పాటైనప్పటికీ పూర్తిస్థాయిలో నిజామాబాద్ పసుపు రైతులకు న్యాయం మాత్రం జరగడం లేదన్నారు. బోర్డు పేరుతో కాలయాపన చేయడం తప్ప.. రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో ఎంపీ పూర్తిగా విఫలమయ్యారన్నారు. రైతుల కష్టాల గురించి మాట్లాడే అర్హత మీకు లేదని వ్యాఖ్యానించారు.
Induru Ranabheri | ఎంపీగా జిల్లాకు తెచ్చిన నిధులెన్ని..
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా అర్వింద్ తెచ్చిన నిధులెన్నో స్పష్టం చేయాలని రామకృష్ణ సవాల్ విసిరారు. కేంద్రం నుంచి జిల్లాకు సాధించిన ప్రత్యేక నిధులు లేదా ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా చెప్పాలన్నారు. స్థానిక సమస్యలను గాలికొదిలేసి, కేవలం ప్రతిపక్షాలపై, స్థానిక నాయకులపై వ్యక్తిగత దూషణలు చేయడమే మీ రణభేరి ముఖ్య ఉద్దేశమా అని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా ప్రశాంతతకు మారుపేరని.. ఇక్కడ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజలు ఊరుకోరని పేర్కొన్నారు. ఎంపీ రణభేరి ప్రసంగంలో అంతా రెచ్చగొట్టే ధోరణి తప్ప, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఎక్కడా కనిపించలేదని వ్యాఖ్యానించారు. మాకు సంస్కారం ఉందని.. అందుకే అర్వింద్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదన్నారు. ఆయన మాత్రం సీఎం రేవంత్రెడ్డి అనరాని మాటలన్నారన్నారు.
Induru Ranabheri | విద్యార్థులతో ఆడుకుంటున్నారు..
చాత్రోస్ కి గూంజ్ ద్వారా మేము విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారికి భరోసా అందిస్తుంటే ఎంపీ రణభేరి పేరుతో విద్యార్థులను అయోమయం చేస్తూ వారికి అభద్రత భావాన్ని కల్పిస్తూ చదువును నాశనం చేస్తున్నారని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ ద్వారా మా జీవితాలు నాశనం అవుతున్నాయని వేలాదిమంది విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ధర్నాలు చేస్తుంటే దానిపై మాట్లాడకుండా ఇక్కడ విద్యార్థుల పక్షాన ఉన్నట్టు డ్రామాలు మానుకోవాలని రామకృష్ణ పేర్కొన్నారు.
Induru Ranabheri | సంస్కారం లేని వ్యక్తి నిజామాబాద్ ఎంపీగా..
కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ మాట్లాడుతూ ఒక సంస్కారం లేని వ్యక్తి నిజామాబాద్కు ఎంపీగా ఉండడం జిల్లా ప్రజల దురదృష్టమన్నారు. రాష్ట్రం మొత్తం అర్వింద్ పిచ్చి పనులను చూసి నవ్వుతున్నారన్నారు. ఏడేళ్లుగా కేంద్ర నుంచి నిధులు తీసుకురాకుండా ఆర్నెళ్లకొకసారి వచ్చి ఏదో ఒక సమావేశం పెట్టి నోటికి వచ్చింది మాట్లాడడం అర్వింద్కు అలవాటైందన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులే తప్ప బీజేపీ తట్టెడు మట్టి మోయలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, డీసీసీ కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు విజయపాల్ రెడ్డి, సయ్యద్ సలీం, జెండా గుడి ఛైర్మన్ లవంగ ప్రమోద్, నగర యూత్ అధ్యక్షుడు మెయిన్, అధికార ప్రతినిధి గోవర్ధన్, కార్యదర్శులు హర్షద్,వహీద్, ఆకుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Illegal Registrations | అక్రమార్కులకు అండాదండా.. కబ్జారాయుళ్లకు సహకరిస్తున్న సబ్రిజిస్ట్రార్లు..!