అక్షరటుడే వెబ్డెస్క్: Kalvakuntla Kavitha Remarks | సోమవారం ( జూన్ 15) మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్మీట్లో టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అధినేత కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha ) మాట్లాడారు. తెలంగాణను ఎంతో పోరాటం చేసి సాధించుకున్నామని, అటువంటి గడ్డపై ఎమ్మెల్యేల గూండాగిరికి తాము ఏమాత్రం భయపడబోమని ఆమె స్పష్టం చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు చేస్తున్న అరాచకాలను తక్షణమే బంద్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Kalvakuntla Kavitha Remarks | సింగరేణిలో అవినీతి..
కాంగ్రెస్ పార్టీ అవినీతి కారణంగానే సింగరేణి సంస్థ తీవ్ర నష్టాల బారిన పడిందని కవిత విమర్శించారు. సింగరేణిని కాపాడేందుకు కేవలం హెచ్ఎంఎస్ (HMS), టీఆర్ఎస్ మాత్రమే నిరంతరం పోరాడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. కార్మికుల సంఖ్యను తగ్గించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా, తాళ్లపల్లిలో భూములిచ్చిన ప్రజలకు ఇంతవరకు పరిహారం అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Kalvakuntla Kavitha Remarks | రాబోయే ప్రణాళికలు..
తమ పార్టీ అధికారంలోకి వస్తే గుజరాత్ మినరల్స్ కార్పొరేషన్ తరహాలో ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామని కవిత హామీ ఇచ్చారు. దీని ద్వారా అండర్ గ్రౌండ్ మైనింగ్ను కూడా అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం వీటిని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని ఆమె కోరారు.
Kalvakuntla Kavitha Remarks | రాజకీయ సవాల్..
తెలంగాణ రక్షణ సేన ఒక ప్రాంతీయ రాజకీయ శక్తిగా ఎదుగుతోందని, సింగరేణి ప్రాంతంలో తమ పార్టీ జెండాను రెపరెపలాడిస్తామని కవిత ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణికి మేలు చేయాలని, అలాగే బీజేపీ అధికారంలోకి రావడం తెలంగాణలో అసాధ్యమని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అవినీతిని త్వరలోనే బయటపెడతామని ఆమె హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Germany Job Opportunities | జర్మనీలో ఉపాధి అవకాశాలు : మంత్రి వివేక్