అక్షరటుడే వెబ్డెస్క్: KTR Kavitha Rakhi | అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షా బంధన్ ( Raksha Bandhan )పండుగకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిల్లలు కేటీఆర్, కవిత ఈసారీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి జరగనుండగా, వరుసగా మూడో ఏడాది కూడా కేటీఆర్కు కవిత రాఖీ కట్టే అవకాశం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గతంలో ప్రతి సంవత్సరం రాఖీ వేడుకలను ఘనంగా జరుపుకుని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకునే ఈ అన్నాచెల్లెళ్లు.. ఇటీవల తలెత్తిన రాజకీయ పరిణామాలు, కుటుంబ విబేధాల కారణంగా వేడుకలకు దూరంగా ఉంటున్నారు.
KTR Kavitha Rakhi | గత రెండేళ్లుగా..
2024 నుంచి కవిత తన సోదరుడికి రాఖీ కట్టడం లేదు. ఆ ఏడాది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టై జైలులో ఉండటంతో రాఖీ వేడుకలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో కేటీఆర్ భావోద్వేగంగా స్పందిస్తూ తన చెల్లికి అండగా ఉంటామని ట్వీట్ చేశారు. ఇక 2025లో సొంత కుటుంబ సభ్యులపై కవిత రాజకీయంగా తీవ్ర ఆరోపణలు గుప్పించడం, పండగ సమయంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో వరుసగా రెండో ఏడాది కూడా రాఖీ వేడుకలు జరగలేదు.
KTR Kavitha Rakhi | అమెరికా పర్యటనకు కేటీఆర్..
ఈ సంవత్సరం రాఖీ పండగ నాటికి కేటీఆర్ స్వదేశంలో అందుబాటులో ఉండబోరని తెలుస్తోంది. తన కుమార్తె ఉన్నత చదువుల నిమిత్తం కేటీఆర్ అమెరికాలోని వర్జీనియాకు బయలుదేరి వెళ్తున్నారు. దాదాపు 15 రోజులకు పైగా ఆయన విదేశీ పర్యటనలో ఉండనుండటంతో, ఆగస్టు 28న జరిగే రాఖీ పౌర్ణమి నాటికి ఆయన నగరంలో ఉండే అవకాశం లేదు. దీంతో ఈసారి కూడా కేటీఆర్కు కవిత రాఖీ కట్టకపోవచ్చనే చర్చ నడుస్తోంది. ఒకవైపు కేటీఆర్పై కవిత విమర్శల జోరు పెంచుతుండగా, మరోవైపు అన్నాచెల్లెళ్ల మధ్య మరింత గ్యాప్ పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాఖీ పండుగ నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: Student Suicides | క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు.. ఆత్మహత్యల బాట పడుతున్న విద్యార్థులు