అక్షరటుడే వెబ్డెస్క్: Singareni Losses | సింగరేణి సంస్థ నష్టాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విధానాలే కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy ) విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన రాష్ట్ర రాజకీయాలు, సింగరేణి సంస్థ భవిష్యత్తు , విద్యా వ్యవస్థకు సంబంధించిన పలు కీలక అంశాలపై మాట్లాడారు.
Singareni Losses | సింగరేణికి వ్యతిరేకంగా..
గత కేసీఆర్ ప్రభుత్వం సింగరేణికి వ్యతిరేకంగా వ్యవహరించిందని, ఇతర రాష్ట్రాల్లోని కోల్ బ్లాక్ల వేలంలో సింగరేణి పాల్గొనకుండా అడ్డుకుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అయితే, ప్రధానంగా ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక సింగరేణి విద్యుత్ ఉత్పత్తి సంస్థ కోసం ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ను కేటాయించామని ఆయన గుర్తు చేశారు. అలాగే సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాడిచర్ల కోల్ బ్లాక్-2ను కేటాయించామని తెలిపారు. మణుగూరులోని పీకేఓసీ (PKOC) బ్లాక్ కూడా సింగరేణికే దక్కాలని భావించినప్పటికీ, అనూహ్యంగా దానికి పోటీగా జెన్కో వేలంలో పాల్గొందని చెప్పారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని జెన్కోను వేలంలో పాల్గొనకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు సింగరేణికి భారీగా బకాయిలు పెట్టాయని ఆయన విమర్శించారు.
Singareni Losses |రేవంత్ రెడ్డి రాజీనామా డిమాండ్..
బీఆర్ఎస్ హయాంలోనూ పేపర్ లీక్లు విచ్చలవిడిగా జరిగాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఇటీవల చోటుచేసుకున్న పదో తరగతి పరీక్షా పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాము ఎలాంటి తప్పు చేయకుండా ఇతరులను రాజీనామా చేయాలని కోరడం సరికాదన్నారు. దేశ హితం కోసం ఏ వ్యవస్థ వచ్చినా తప్పులేదని, కానీ దేశానికి నష్టం చేసే వ్యవస్థ వస్తే మాత్రం అది ప్రమాదకరమని కిషన్ రెడ్డి హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Dharmendra Pradhan Resignation | బీజేపీకి దేశం ముఖ్యం.. పదవి కాదు.. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా: దినేష్ కులాచారి