అక్షరటుడే, వెబ్డెస్క్: Maoist Leader Surrenders | మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల (Telangana Police) ఎదుట లొంగిపోయారు. దాదాపు 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ అడవుల్లో గెరిల్లా పోరాటం సాగించిన ఆయన ఆయుధాలు వీడారు.
Maoist Leader Surrenders | విద్యార్థి దశ నుంచే ఉద్యమంలోకి..
హనుమకొండ జిల్లా (Hanumakonda District) కాజీపేట మండలంలోని సోమిడి గ్రామానికి చెందిన నరహరి 1980లో వరంగల్ ఎల్బీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో నక్సలైట్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడయ్యారు. అప్పటి ఉద్యమ నాయకులు పులి అంజయ్య, బక్కన్నల ప్రభావంతో ఆయన పూర్తిస్థాయి ఉద్యమ జీవితాన్ని ఎంచుకున్నారు. మొదట గ్రామీణ ప్రాంతాల్లో కూలీల హక్కులు, భూస్వాముల అరాచకాలపై పోరాడిన నరహరి.. తరువాత పోలీసుల నిర్బంధం పెరగడంతో 1996లో పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అడవుల్లోనే కార్యకలాపాలు కొనసాగిస్తూ మావోయిస్టు పార్టీ (Maoist Party)లో కీలక నాయకుడిగా ఎదిగారు.
Maoist Leader Surrenders | కేంద్ర కమిటీలో కీలక పాత్ర
తన వ్యూహాత్మక నైపుణ్యంతో పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన నరహరి.. చివరకు మావోయిస్టు పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన కేంద్ర కమిటీలో స్థానం సంపాదించారు. అలాగే ఝార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగానికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ పలు కీలక వ్యూహాలకు రూపకల్పన చేసినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా జరిగిన పలు మావోయిస్టు ఆపరేషన్లలో ఆయన పాత్ర ఉన్నట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఆయన భార్య కూడా పార్టీలోనే చురుకుగా పనిచేస్తూ కీలక బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం. ఇటీవల ఝార్ఖండ్లోని సరండా అడవుల్లో కేంద్ర భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా భారీ కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేతలు మిసిర్ బెస్రా, గణపతి వంటి నాయకులను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్లు ముమ్మరం చేశారు.
Maoist Leader Surrenders | ఝార్ఖండ్ నుంచి రహస్యంగా తెలంగాణకు..
ఒకవైపు భద్రతా బలగాల ఒత్తిడి పెరగడం, మరోవైపు వయస్సు, అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో నరహరి దంపతులు అజ్ఞాత జీవితాన్ని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఝార్ఖండ్ నుంచి రహస్యంగా తెలంగాణకు చేరుకుని పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో పలువురు అగ్రనేతలు మరణించడం, మరికొందరు లొంగిపోవడం వల్ల ఇప్పటికే పార్టీ బలహీనపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు కేంద్ర కమిటీ స్థాయి నేత లొంగిపోవడం మిగిలిన క్యాడర్పై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..: Miyapur Girl Death | నీటి సంపులో పడి బాలిక మృతి

