అక్షరటుడే, వెబ్డెస్క్: Miyapur Murder Case | హైదరాబాద్లోని మియాపూర్ Miyapurలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి, మృతదేహాన్ని మహారాష్ట్రకు తరలించి ఆనవాళ్లు చెరిపేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి కేసును ఛేదించారు.
Miyapur Murder Case | గతేడాది నవంబరులో
పోలీసుల వివరాల ప్రకారం.. పెంటేశ్ (45) అనే వ్యక్తి కనిపించడం లేదంటూ ఆయన భార్య సత్యవతి గతేడాది నవంబరులో మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో భాగంగా సత్యవతి కాల్ రికార్డులు, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు ఆమె ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేశారు. లోతుగా విచారించగా, తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Miyapur Murder Case | నిద్రమాత్రలు కలిపి, దిండుతో ఊపిరాడకుండా చేసి
పోలీసుల కథనం ప్రకారం.. ముందుగా భర్త భోజనంలో నిద్రమాత్రలు కలిపిన సత్యవతి, అతడు గాఢనిద్రలోకి జారుకున్న తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తేలింది. అనంతరం ప్రియుడి సహాయంతో మృతదేహాన్ని కారులో మహారాష్ట్రకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు వెల్లడైంది.
Miyapur Murder Case | సరిహద్దు ప్రాంతంలో పూడ్చి
కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించగా, గుర్తుతెలియని వ్యక్తి హత్యగా అక్కడ కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పూడ్చిపెట్టినట్లు దర్యాప్తులో బయటపడింది.
మహారాష్ట్ర పోలీసుల సహకారంతో మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, కేసులో కీలక ఆధారాలను సేకరించారు. నిందితులను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలపై విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.