అక్షరటుడే, వెబ్డెస్క్ : MPTC ZPTC Elections | రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. దీంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవి కాలం 2024 జూన్లో ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించలేదు. గతేడాది 42 శాతం బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఆ జీవోను హైకోర్టు కొట్టివేయడంతో ఎన్నికలు ఆగిపోయాయి. దీంతో దాదాపు రెండేళ్లుగా మండల, జిల్లా పరిషత్లకు పాలకవర్గాలు కరువయ్యాయి. ఈ క్రమంలో మే నెలలో ఎన్నికలు నిర్వహిస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు.
MPTC ZPTC Elections | ఆశావహుల నిరీక్షణ
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఆశావహులు నిరీక్షిస్తున్నారు. త్వరలో ఎన్నికలనే ప్రచారం జరగడంతో ఇటీవల పలువురు తమకు టికెట్ ఇవ్వాలని ఆయా పార్టీల నేతలను సైతం కలిశారు. అయితే తాజాగా ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయ, ఉద్యోగుల బదిలీల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. మరోవైపు త్వరలో జనగణన (Census) నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. అధికారులు జన గణన విధుల్లో నిమగ్నం కానున్నారు. దీంతో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తెలుస్తోంది.
MPTC ZPTC Elections | ఆగస్టులో ఎన్నికలు
ప్రస్తుతం ఉద్యోగుల బదిలీ ప్రక్రియ కొనసాగునుంది. మే, జూన్ నెలల్లో జన గణన నిర్వహిస్తారు. అలాగే జూన్ 12 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయి. దీంతో ఉపాధ్యాయులు అడ్మిషన్లు, ఇతర పనులతో బిజీగా ఉంటారు. దీంతో మే, జూన్ నెలల్లో ఎన్నికలు సాధ్యం కాదు. జూలైలో వానాకాలం సాగు పనులు జోరుగా సాగుతాయి. దీంతో జులై చివరిలో లేదా ఆగస్టులో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇది కూడా చదవండి..: Telangana Fuel Shortage | తెలంగాణలో పెట్రోలు కష్టాలు.. పెరిగిన డిమాండ్తో బంకుల్లో నో స్టాక్

