అక్షరటుడే, న్యూఢిల్లీ: Online Gaming Authority | దేశంలో ఆన్లైన్ గేమింగ్, రియల్ మనీ గేమ్ల వల్ల ఏటా లక్షలాది మంది ఆర్థికంగా నష్టపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏటా సుమారు 45 కోట్ల మంది ఈ గేమింగ్ ఉచ్చులో చిక్కి దాదాపు రూ. 20,000 కోట్లు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ సామాజిక సమస్యను అరికట్టేందుకు, ఆదాయాన్ని సైతం పక్కనపెట్టి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం కొత్త నియంత్రణ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది.
Online Gaming Authority | ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఏర్పాటు..
ఆన్లైన్ గేమింగ్ను పర్యవేక్షించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక’ఆన్లైన్ గేమింగ్ అథారిటీ’ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనికి ఐటీ శాఖ అదనపు కార్యదర్శి ఈ అథారిటీకి ఛైర్పర్సన్గా వ్యవహరిస్తారు. హోం శాఖ, ఆర్థిక సేవలు, సమాచార ప్రసారాలు, క్రీడలు , న్యాయ శాఖల జాయింట్ సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు.
Online Gaming Authority | మే 1 నుంచి అమలు..
ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్, నియంత్రణ చట్టం-2025లో చేసిన సవరణలు మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఈ అథారిటీ ఒక డిజిటల్ కార్యాలయంగా పనిచేస్తూ ఈ-స్పోర్ట్స్ సహా అన్ని రకాల ఆన్లైన్ గేమ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది.
Online Gaming Authority | నిబంధనలు..
ఎక్కువ మంది యూజర్లు ఉండే గేమ్లు, ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న హై-రిస్క్ గేమ్లు తప్పనిసరిగా అథారిటీ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. యూజర్ల డేటా భద్రత, డేటా రిటెన్షన్ వంటి అంశాలపై మార్గదర్శకాలను జారీ చేసే అధికారం ఈ సంస్థకు ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించే గేమింగ్ సంస్థలపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం ఈ అథారిటీ పరిధిలోకి వస్తుంది. ఈ-స్పోర్ట్స్ , సోషల్ గేమింగ్ సేవలు అందించే కంపెనీల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది.
ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఏర్పాటుతో అక్రమ గేమింగ్ యాప్లకు అడ్డుకట్ట పడటమే కాకుండా, యువత ఆర్థికంగా నష్టపోకుండా రక్షణ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కూడా చదవండి..: KTR Attack Congress | తెలంగాణకు శని కాంగ్రెస్ : కేటీఆర్

